తెలంగాణలో పవన్ కల్యాణ్ కామెడీ ?

 

నిజమే కదా ? తెలంగాణా ఎన్నికల్లో జనసేన పోటీ చేయటం లేదు. అందుకు కారణాలు కూడా పవనే ఇది వరకే ప్రకటించారు. మరింకా ఎందుకు తెలంగాణా ఎన్నికలను తనంతట తానుగా కెలుక్కుంటున్నారు ? ఎవరికి ఓట్లేయాలో చెబుతూ భలే కామిడీ పండిస్తున్నారు. మంచి అభ్యర్ధులను చూసి ఓట్లేయమని తాజాగా పిలుపివ్వటం ఎందుకో అర్ధం కావటం లేదు. తెలంగాణా ఓటర్లు ఎవరికి ఓట్లు వేయాలనే అయోమయంలో ఉన్నారట. ఎందుకంటే, తెలంగాణా ఇచ్చింది మేమే అని ఒకళ్ళంటే కాదు తెచ్చింది మేమే అని మరోకళ్ళంటున్నారట. ఆ రెండు పార్టీల్లో ఎవరు చెప్పేది నిజమో తేల్చుకోలేక జనాలు అయోమయంలో ఉన్నారట.

రాజకీయాలంటేనే ఒక  స్టాంట్ తీసుకోవడం. ఒకస్టాండ్ తీసుకుని మన పార్టీని నిర్మిస్తాం. ఇతరపార్టీలమీద, సమస్య ల మీద మనకోస్టాండ్ ఉంటుంది. ఏ స్టాండ్ తీసుకోలేకపోవడాన్ని ఏమనాాలి, అరాచకీయంఅనొచ్చా. తెలంగాణ ఎన్నికల మీద ఏ స్టాండ్ తీసుకోలేని పరిస్థితి రావడమ ఏమిటి? అంతక్లారిటీ ఇవ్వనంత గందరగోళం తెలంగాణలోఉందా?

పవన కల్యాణ్ చెప్పినట్లుగా జనాలేమీ అయోమయంలో లేరన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎవరికి ఓట్లు వేయాలో ఇఫ్పటికే జనాల్లో  ఓ స్పష్టతతోనే ఉన్నారు. పోయిన ఎన్నికల్లోనే జనాలు కెసియార్ కు అత్యధిక సీట్లిచ్చి అధికారంలో కూర్చోబెట్టలేదా ? తెలంగాణా ఇచ్చింది-తెలంగాణా తెచ్చిందనే వాదన పోయిన ఎన్నికల్లో కూడా ఉందికదా ? అప్పుడేమైనా ఓటర్లు అయోమయంలో ఉన్నారా ? రేపటి ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలనే విషయంలో కూడా జనాలకు ఓ క్లారిటీ ఉండే ఉంటుంది. జనసేన అధినేత మాటలు చూస్తుంటే క్లారిటీ లేనిది పవన్ కే అని అర్ధమవుతోంది.

ఆమధ్య రెండు రాష్ట్రాల్లోను పోటీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి తర్వాత చేతులెత్తేసింది పవనే. తెలంగాణా ఎన్నికలు ముందుగా వచ్చేశాయి కాబట్టి తాము ఎన్నికలకు ప్రిపేర్ కాలేకపోయామని ఓ చెత్త సంజాయిషీ ఇచ్చుకున్నారు. ముందస్తు ఎన్నికల వల్ల పవనే కాదు అన్నీ పార్టీలు ఇబ్బందులు పడ్డాయి. పైగా తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మీడియా ఎప్పటి నుండో కోడై కూస్తూనే ఉంది. అయినా ప్రిపేర్ కాలేకపోయారంటే కేవలం చేతకాని తనమనే భావించాలి.

 

తెలంగాణా ఎన్నికల్లో పాల్గొనలేకపోయిన తర్వాత ఇక తెలంగాణా ఎన్నికల గురించి పవన్ కు ఎందుకు ? తెలంగాణ గురించి తనకేదో మానవాతీత జ్ఞానమేదో ఉన్నట్లు ఓటర్లు అయోమయంలో ఉన్నారనే స్టేట్మెంట్ ఒకటి మళ్ళీ. పైగా అభ్యర్ధులను చూసి ఓట్లేయమని ఉచిత సలహా ఒకటి మళ్ళీ.ఆ  మాత్రం  జనాలకు తెలీదా ఎవరికి ఓట్లేయాలో ? ఎక్కువ పారదర్శకత, తక్కువ అవినీతితో పాలన ఎవరైతే అందించగలరో వాళ్ళకే ఓట్లేయాలని అభిమానులకు, జనాలకు పిలుపు కూడా ఇచ్చేయటం భలే కామిడీగా ఉంది. వైసిపి కూడా తెలంగాణా ఎన్నికల్లో పాల్గొనటం లేదు. దాని కారణాలు దానికున్నాయి. అలాగని ఎన్నికల గురించి  జగన్మోహన్ రెడ్డి ఎక్కడా మాట్లాడటం లేదు. కాబట్టి పవన్ కూడా తెలంగాణా ఎన్నికలను వదిలేసి ఏపి విషయాలపై దృష్టి పెడితే బాగుంటుంది.