మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీగా ఉండి, టీఆర్ఎస్ టికెట్ తెచ్చుకోలేకపోయిన జితేందర్ రెడ్డి ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. నిన్న రాత్రి ఆ పార్టీ నేత రామ్ మాధవ్ తో సుదీర్ఘంగా మంతనాలు సాగించిన ఆయన, తాను బీజేపీలో చేరాలంటే కొన్ని కోరికలు తీర్చాలని అడిగినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పదవిని లేదా తెలంగాణ ఇంఛార్జీ బాధ్యతలు ఇవ్వడం, 29న తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్ నగర్ కు వెళ్లే సమయంలో హైదరాబాద్ నుంచి తనను కూడా మోదీ ప్రయాణించే చాపర్ లో మహబూబ్ నగర్ కు పంపడం, ఏదైనా ఓ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడం… ఈ మూడు డిమాండ్లనూ జితేందర్ రెడ్డి బీజేపీ ముందుంచగా, తొలి రెండు డిమాండ్లకూ రామ్ మాధవ్ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది.
కాగా, గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని జితేందర్ రెడ్డిపై ఆరోపణలు రాగా, మరోమారు టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించారు. ఎంపీ టికెట్ రాకపోవడంతో తాను పార్టీ మారను అంటూనే ఆయన బిజెపి నేతలతో టచ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆయన అనూహ్యంగా బిజెపిలోకి చేరుతున్నారు. ఈ నెల 29న ఆయన బిజెపిలో మోదీ సమక్షంలో చేరనున్నారు.
