అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఊపు మీదున్న టిఆర్ఎస్ కు తెలంగాణలో తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ బలపర్చిన ముగ్గురు అభ్యర్ధులు ఓటమి పాలయ్యారు. టిఆర్ఎస్ కు గట్టి పట్టున్న వరంగల్ ఖమ్మం నల్లగొండలో ఘోర ఓటమి పాలైంది. కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో కూడా ఘోరంగా ఓడిపోయింది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటి పడిన పాతూరి సుధాకర్ రెడ్డి ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయారు. మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్న ఆయనకు ఇది పెద్ద దెబ్బ.
కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీఆర్టీయూ రెబల్ రఘోత్తం రెడ్డి, నల్లగొండ స్థానం నుంచి యూటిఎఫ్ నర్సిరెడ్డి విజయం సాధించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి విజయం సాధించారు. ప్రత్యర్థులు అందుకోలేనంత దూరంలో ఆయన గెలుపొందారు. తమకు తిరుగులేదనుకున్న టీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు షాకివ్వగా, వలసలతో కుదేలవుతున్న కాంగ్రెస్కు ఈ ఫలితాలు బూస్ట్ లా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యే సరికి వారు తమ అభ్యర్దులు కాదు అని టిఆర్ఎస్ తప్పించుకుంటుందని, గెలిస్తే ఇలానే మాట్లాడేవారా అని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు.
