జగన్ దెబ్బతో, కమ్మ నేతలకు చంద్రబాబు షాక్

Chandrababu Naidu, Jagan Mohan Reddy and the debate over Kamma leaders in TDP appointments

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశంలో ఇప్పుడు ఒక సరికొత్త ఇంటర్నల్ పొలిటికల్ వార్ మొదలైందా? దశాబ్దాలుగా పార్టీకి ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచిన కరడుగట్టిన సీనియర్ నేతలలో లోలోపల అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయా? అవును, ప్రస్తుతం ఏపీ రాజకీయంలో వినిపిస్తున్న హాట్ టాపిక్.. టీడీపీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలకు ఆశించిన స్థాయిలో పదవులు దక్కడం లేదు. నిన్న ప్రకటించిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల దగ్గర నుండి.. రాబోయే కేబినెట్ విస్తరణ సమీకరణాల వరకు చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు సొంత సామాజిక వర్గ నేతలకే మింగుడు పడటం లేదు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ‘ఒకే సామాజిక వర్గ పాలన’ అనే బలమైన విమర్శల దెబ్బకు భయపడే.. చంద్రబాబు ఇప్పుడు కమ్మ నేతలను పక్కన పెడుతున్నారా? అసలు పదవులు రాని ఆ టాప్ లీడర్లు ఎవరు? ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ వీడియోలో ఓ లుక్ వేద్దాం.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలను ఖరారు చేసింది. ఈ రేసులో ఎంతో మంది సీనియర్ కమ్మ నేతలు ఆశలు పెట్టుకున్నప్పటికీ, చంద్రబాబు నాయుడు మాత్రం పక్కాగా సోషల్ ఈక్వేషన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. దళిత సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వర్ల రామయ్యను ఎస్సీ కోటా కింద, అలాగే అనంతపురానికి చెందిన సాధారణ మహిళా కార్యకర్త దళవాయి రమాదేవిని బీసీ కోటా కింద ఎంపిక చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి, సామాజిక న్యాయానికి తాము కట్టుబడి ఉన్నామని చాటిచెప్పడానికి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఈ ఎంపికతో ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్ద సామాజిక వర్గ నేతలు తీవ్ర నిరాశలో మునిగిపోయారనేది ఓపెన్ టాక్.

టీడీపీ అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా.. గతంలో వైఎస్సార్సీపీని ఒంటిచేత్తో ఢీకొట్టిన ఎంతో మంది కీలక కమ్మ నేతలకు ఇప్పటికీ ఎలాంటి గుర్తింపు దక్కలేదు. ఉదాహరణకు కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. గత ఐదేళ్లూ పార్టీ కోసం కేసులు ఎదుర్కొని పోరాడిన ఆయనకు ఎన్నికల్లో సీటు రాలేదు, ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు లేదా ఎమ్మెల్సీలలో కూడా చోటు దక్కలేదు. అలాగే రాయలసీమలో పట్టున్న పరిటాల కుటుంబం నుండి పరిటాల శ్రీరామ్‌కు కూడా ఎలాంటి పదవి లభించలేదు. వీరితో పాటు చాలా మంది వెయింటింగ్ లిస్టు లో ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంతలా వెనకడుగు వేస్తున్నారంటే.. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన సుదీర్ఘమైన నెగెటివ్ ప్రచారమే కారణం. “టీడీపీ అంటే కేవలం ఒకే సామాజిక వర్గం పార్టీ.. అధికారం వస్తే వారికే పదవులు ఇస్తారు” అంటూ జగన్ మోహన్ రెడ్డి చేసిన విమర్శలు జనం మెదళ్లలోకి బలంగా వెళ్లాయి. అందుకే ఈసారి కూటమి ప్రభుత్వంలో అలాంటి ముద్ర పడకూడదని చంద్రబాబు చాలా జాగ్రత్త పడుతున్నారు. చివరకు కేబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ.. మళ్లీ కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు వస్తాయనే భయంతోనే ఆ నిర్ణయాన్ని కూడా హోల్డ్‌లో పెట్టారనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా నడుస్తోంది.

దీనికి తోడు ఈసారి టీడీపీ ఒంటరిగా అధికారంలోకి రాలేదు. జనసేన, బీజేపీలతో కూడిన కూటమి సర్కార్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనకు మరియు కాపు సామాజిక వర్గానికి ఈ ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలను జనసేనకు కేటాయించారు. అలాగే కీలకమైన నామినేటెడ్ పదవుల్లో, కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు కాపు సామాజిక వర్గాలకే సింహభాగం దక్కుతోంది. దీనివల్ల టీడీపీలోని సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న కమ్మ నేతలకు దక్కాల్సిన అవకాశాలు భారీగా తగ్గిపోతున్నాయనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా, రాజకీయాల్లో అధికారం ముఖ్యం. కానీ నమ్ముకున్న లీడర్లను సంతృప్తి పరచడం కూడా అంతే ముఖ్యం. వైసీపీ చేసిన విమర్శల భయంతో చంద్రబాబు సొంత సామాజిక వర్గ సీనియర్లను ఇలాగే దూరం పెడితే.. భవిష్యత్తులో పార్టీకి ఆర్థికంగా, క్షేత్రస్థాయిలో అండగా ఉండేది ఎవరనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.