ఎన్నికల వేళ టిఆర్ఎస్ పార్టీ మరో నిర్ణయం తీసుకుంది. పార్టీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి రెబల్స్ గా బరిలో ఉన్న నలుగురు నేతలను రెండు రోజుల క్రితమే టిఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించింది. తాజాగా మరో నేత మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ టిఆర్ఎస్ ఉత్తర్వులు జారీ చేసింది. అసలు వివరాలు ఏంటంటే..

తోకల శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించారు. ఆయన రాజేంద్రనగర్ నుంచి టిఆర్ఎస్ అసెంబ్లీ టికెట్ ను ఆశించారు. కానీ ఆ స్థానాన్ని టిడిపి నుంచి పార్టీలో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కే మళ్లీ కేటాయించారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్ధిగా పోటి చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డిని విరమించుకోవాలని కోరినా ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టిఆర్ఎస్ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటివల రెబల్స్ గా మారిన నలుగురిని పార్టీ నుంచి బహిష్కరించారు. వారిలో బెల్లంపల్లి నుంచి రెబల్ గా ఉన్న వినోద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి గజ్జెల నగేష్, షాద్ నగర్ నుంచి శంకర్, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి ఉన్నారు.
వివేక్ సోదరుడు వినోద్. వీరిద్దరు కూడా వెంకటస్వామి కుమారులు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీరు 2014 ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ లో చేరారు. వినోద్ కు పార్టీలో తగిన ప్రాధాన్యతనిస్తామని చెప్పినా ఇప్పటి వరకు తనను పట్టించుకోలేదనే ఆవేదనలో వినోద్ ఉన్నట్టు తెలుస్తోంది. వినోద్ కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేశారు. మాజీ మంత్రి అయినప్పటికి కూడా తనకు పార్టీలో ప్రాధాన్యత లేదని తన అనుచరుల వద్ద వాపోయారు.

వినోద్ పార్టీ మారుతారని తెలిసి మంత్రి కేటిఆర్ వినోద్ తో చర్చలు జరిపారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే సీటు కావాలని కోరినప్పటికి సీట్ల కేటాయింపు జరిగిపోవడంతో కేటాయించలేమని కేటిఆర్ చెప్పారు. అయినా కూడా వినోద్ వెనుకకు తగ్గలేదు. చెన్నూరు నుంచి వినోద్ పోటి చేస్తారని అంతా అనుకున్నారు కానీ బెల్లంపల్లి నుంచే టిఆర్ఎస్ రెబల్ గా వినోద్ బరిలో నిలిచారు. వినోద్ సోదరుడు వివేక్ మాత్రం టిఆర్ఎస్ లో నే ఉన్నారు. పార్టీ క్రమశిక్షణ చర్యలకింద వినోద్ ను బహిష్కరిస్తూ టిఆర్ఎస్ ఉత్తర్వులు జారీ చేసింది.

కంటోన్మెంట్ నుంచి గజ్జెల నగేష్ రెబల్ గా బరిలోకి దిగారు. కంటోన్మెంట్ టిఆర్ఎస్ ఇంఛార్జీగా నగేష్ ఉన్నారు. ఆయనకే అసెంబ్లీ సీటు దక్కుతుందని ఆశించారు. కానీ అనూహ్యంగా సీటు వేరే వారికి కేటాయించడంతో ఆయన ఖంగుతిన్నారు. గజ్జెల నగేష్ కే టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు ఆందోళనలు కూడా చేశారు. టిఆర్ఎస్ నిర్ణయం మార్చుకోకపోవడంతో ఆయన రెబల్ గా నామినేషన్ వేసి పోటిలో ఉన్నారు. దీంతో ఆయనను బహిష్కరిస్తున్నట్టు పార్టీ ప్రకటించింది.

షాద్ నగర్ నుంచి వీరపల్లి శంకర్ రెబల్ గా ఉన్నారు. షాద్ నగర్ టికెట్ అంజయ్య యాదవ్ కు కేటాయించారు. అంజయ్య యాదవ్ అభ్యర్ధిత్వాన్ని శంకర్ వ్యతిరేకించారు. తాము పార్టీ కోసం కృషి చేస్తే వేరే వాళ్లకు టికెట్ ఎలా కేటాయిస్తారని శంకర్ ప్రశ్నించారు. అందుకే తాను రెబల్ గా పోటిచేస్తానని ప్రకటించి బరిలో దిగారు. దీంతో అధిష్టానం ఆయన పై వేటు వేసింది.

