తీవ్ర తర్జనబర్జల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై చర్చలను ఒక కొలిక్కి తెచ్చింది. సోనియాగాంధీ నేతృత్వంలో గంటల కొద్దీ గత రెండు రోజులుగా భేటీ అయిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్స్ కమిటీ అభ్యర్థుల ఖరారు చేపట్టింది. ఇప్పటి వరకు 74 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయగా, మరో 19 సీట్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ 93 స్థానాల్లో పోటి చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటి సమావేశం ముగిసింది. తెలంగాణలో 119 స్థానాల్లో 26 స్థానాలను భాగస్వామ్య పార్టీలకు కేటాయించారు. 93 స్థానాల్లో కాంగ్రెస్ పోటి చేస్తుంది. 119 స్థానాలకుగాను ఇప్పటికే 74 మంది అభ్యర్దుల్ని ఖరారు చేశారు.
టిడిపికి 14, టిజెఎస్ కు 8, సిపిఐ కి 3 సీట్లు కేటాయించారు. 119 స్థానాలకు ఒకే సారి అభ్యర్దుల్ని ప్రకటించాలనున్నా కొన్ని కారణాల వల్ల అన్ని స్థానాలను ఒకే సారి ప్రకటించలేకపోతున్నామని కుంతియా తెలిపారు. 10 వ తేదిన ఉదయం 74 మంది అభ్యర్దుల్ని ప్రకటించనున్నారు. ఒక స్థానం ఇంటి పార్టీకి కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కు నకిరేకల్ సీటు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నకిరేకల్ కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోటిలో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటును ఇంటి పార్టీకి కేటాయించే అవకాశం ఉండడంతో చిరుమర్తికి నిరాశ తప్పదని తెలుస్తోంది.
చిరుమర్తి లింగయ్య కోమటిరెడ్డి సోదరుల అనుచరుడు. ఒక ఇంటిలో రెండు సీట్లు ఇవ్వడం కుదరదని ఇప్పటికే ప్రకటించిన అధిష్టానం కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి కూడా సీటు ఇవ్వనున్నట్టు తెలిసింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్లగొండ, రాజగోపాల్ రెడ్డికి మునుగోడు స్థానాలను దాదాపు ఖరారు చేసింది. ఈ పక్షంలో కోమటిరెడ్డి అనుచరుడు లింగయ్యకు టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పినట్టు తెలుస్తోంది. నకిరేకల్ నియోజకవర్గంలో చెరుకు సుధాకర్ కు మంచి పేరు ఉండటంతో అక్కడ సునాయాసంగా గెలువొచ్చు అనే ఆలోచనతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. చెరుకు సుధాకర్ భార్య లక్ష్మీ గతంలో పోటి చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నా కూడా టిఆర్ఎస్ లో ఆయనకు గుర్తింపు లభించలేదు. నకిరేకల్ నియోజకవర్గంలోని బిసి, ఎస్సీ ఓట్లు చెరుకు సుధాకర్ కు బలంగా ఉండే అవకాశం ఉంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకునే చెరుకు సుధాకర్ కు టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
7 వతేది అర్ధరాత్రి వరకు చర్చలు జరిపిన స్క్రీనింగ్ కమిటి, 8 వ తేది కూడా దాదాపు 10 గంటలపాటు అసంతృప్తులతో చర్చలు జరిపింది. సీట్లు ప్రకటించిన తర్వాత ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆశావాహులతో ముందుగానే ఢిల్లికి పిలుపించుకోని మాట్లాడారు. డికె అరుణ, సబితా ఇంద్రారెడ్డిలు కూడా హాజరయ్యారు. వీరు కూడా వారి కూతురు, కుమారులకు టికెట్ అడుగుతుండడంతో నేతలు ముందుగానే వీరితో చర్చించారు. దీంతో ఆశావాహులు కూడా అంతా నిశ్శబ్దమయినట్టు తెలుస్తోంది.
సిపిఐకి బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ కేటాయించినట్టు తెలుస్తోంది. దీంతో సిపిఐ శుక్రవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం కానుంది. ముందు నుంచి కూడా సిపిఐ 5 సీట్లు కావాలని పట్టుబడుతోంది. లేని పక్షంలో 3 అసెంబ్లీ, ఒక ఎమ్మెల్సీ పదవికి డిమాండ్ చేసింది. దీంతో 3 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ మొగ్గు చూపినట్టు చర్చ జరుగుతోంది.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. నవంబర్ 11, 12 న స్ర్క్రీనింగ్ కమిటి మరో సారి సమావేశమయ్యి మిగిలిన 20 మంది అభ్యర్దులను ఖరారు చేయనుంది.
