మరో ఎమ్మెల్సీ పై బహిష్కరణ వేటు వేసిన టిఆర్ఎస్

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలపై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కే. యాదవరెడ్డిని సస్పెండ్ చేశారు. ఆయనను సస్పెండ్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

యాదవ రెడ్డి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతారన్న సమాచారంతో యాదవరెడ్డిని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే చేవేళ్ల ఎంపీ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఆయన శుక్రవారం మేడ్చల్ లో జరిగే బహిరంగ సభలో సోనియా ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నారు. 

ఎమ్మెల్సీ యాదవ రెడ్డి

యాదవరెడ్డి కూడా గత కొంత కాలంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనడం లేదు. యాదవరెడ్డి ఎమ్మెల్యే టికెట్ ను ఆశించారు. కానీ అధినేత టికెట్ ను కేటాయించలేదు. అప్పటి నుంచి యాదవరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కాంగ్రెస్ నాయకులతోను ఆయన సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. వీటన్నింటి పరిగణలోకి తీసుకున్న టిఆర్ఎస్ పార్టీ యాదవరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వికారాబాద్ జిల్లాకు చెందిన యాదవరెడ్డి తాండూరు  అసెంబ్లీ సీటును ఆశించినట్టుగా తెలుస్తోంది. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పటికి కూడా ఎమ్మెల్యే, మంత్రి పట్నం మహేందర్ రెడ్డి హావానే సాగిందనే అసంతృప్తి ఆయనలో ఉంది. ప్రతి చిన్న విషయంలో కూడా మహేందర్ రెడ్డి అడ్డు తగిలేవాడని యాదవరెడ్డి ఆరోపించారు. పార్టీలో విలువ లేదని, అధికారులు కూడా కనీస ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచారన్నారు. వీటన్నింటి నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆయన పార్టీ మారుతారన్న విషయం తెలిసి టిఆర్ఎస్ అతని పై బహిష్కరణ వేటు వేసింది.  

కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై కూడా టిఆర్ఎస్ వేటు వేయాలని చూసింది కానీ దానిని పసిగట్టిన కొండా వారికి అవకాశం ఇవ్వకుండా పార్టీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. కేటిఆర్ కొండాతో తానే 15 నుంచి 20 ఏండ్లు సీఎంగా ఉంటానని ఆలోచించుకోవాలన్నారు. వినకపోతే నీ ఇష్టం అంటూ కూడా కేటిఆర్ కొండాతో అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోెతే సీఎం సారు వేటు వేయాలన్నారని చెప్పగా వేస్తే వేసుకోండంటూ కొండా అంతే ఘాటుగా బదులిచ్చారు. టిఆర్ఎస్ లో నిన్న మొన్న వచ్చిన వారికి ప్రాధాన్యం ఉందని పార్టీ కోసం పని చేసేవారికి గుర్తింపు లేదన్నారు. చాలా మంది నేతలు టిఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్నారని వారంతా కూడా ఎన్నికల నాటికి బయటికి వస్తారని కొండా తెలిపారు. 

తాజాగా కొండా అనుచరునిగా పేరున్న యాదవరెడ్డి పై వేటు వేయడంతో టిఆర్ ఎస్ లో అసంతృప్తులంతా త్వరలోనే వేరే పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యాదవరెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరుతారనే విషయాన్ని ప్రకటించలేదు. ఆయన కాంగ్రెస్ లోనే చేరుతారని తెలుస్తోంది. సోనియా గాంధీ సమక్షంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు కలిసి చేరుతారని తెలుస్తోంది. 

చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

టిఆర్ఎస్ ఒంటెద్దు పోకడలతోనే నేతలంతా ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల నాటికి టిఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ లో వన్ మ్యాన్ షో నడుస్తుందని మిగిలిన వారంతా బొమ్మలుగా  మిగిలిపోయారన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఏ పార్టీ నేతలైనా ఎలా పార్టీలో కొనసాగగలరని వారు ప్రశ్నించారు. కేసీఆర్ అహం అణచే రోజు దగ్గరలోనే ఉందని వారన్నారు.