షాకింగ్ న్యూస్ : రేవంత్ కు కేంద్ర బలగాల భద్రతకు గ్రీన్ సిగ్నల్

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి  కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. సీఎం కేసీఆర్ తో ముప్పు ఉందని, రాష్ట్ర ప్రభుత్వ భద్రతపై తనక నమ్మకం లేదని కేంద్ర ప్రభుత్వ భద్రత కల్పించాలని రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్ పిటిషన్ విచారించిన కోర్టు రేవంత్ కు  ఎన్నికలయ్యే వరకు కేంద్ర ప్రభుత్వ భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలిచ్చింది. రేవంత్ భద్రతకు అయ్యే ఖర్చును రేవంత్ రెడ్డే భరించాలని కోర్టు ఆదేశాలలో పేర్కొంది. రేవంత్ రెడ్డికి 4+4 సిఆర్పీఎఫ్ భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. 

రేవంత్ పిటిషన్ నేపథ్యం ఇది…

రేవంత్ రెడ్డి పై గతంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని ఆపరేషన్ బ్లూస్టార్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి అప్పటి నుంచే తన భద్రత పై ఆందోళన వ్యక్తం చేశారు. టిఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి దేహశుద్ది తప్పదని హెచ్చరించారు.

ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకున్న రేవంత్ రెడ్డి తనకు టిఆర్ ఎస్ ప్రభుత్వం నుంచి, నేతల నుంచి హాని ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ అంతటా ప్రచారం చేయాల్సి ఉన్నందున తన పై దాడులు జరిగే అవకాశం ఉందని తనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భద్రత పై నమ్మకం లేదని రేవంత్ రెడ్డి అనేక సందర్బాల్లో తెలిపారు.

రేవంత్ రెడ్డి తన భద్రత విషయంలో ఇటీవల కాలంలో ఆందోళనతో ఉన్నారు. ఆయన తనకు కేంద్ర బలగాల భద్రత విషయమై ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారి రజత్ కుమార్ ను కలిసి స్వయంగా విన్నవించారు. తన భద్రత విషయంలో తనకు, తన కుటుంబసభ్యులకు ఆందోళన ఉందని ఆయన రజత్ కుమార్ కు వివరించారు.

అయినప్పటికీ రజత్ కుమార్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. ప్రస్తుతం మహేందర్ రెడ్డి తెలంగాణ డిజిపిగా ఉన్నారు. ఆయన మీద తొలిరోజుల నుంచే రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు. డిజిపి మహేందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి లోపాయికారి మద్దతు ఇస్తున్నట్లు రేవంత్ ఆరోపించారు .

అంతేకాకుండా నాగార్జున సాగర్ లో జరిగిన టిఆర్ఎస్ ప్లీనరీలో పాల్గొని మహేందర్ రెడ్డి ప్రసంగించారని చెబుతూ వచ్చారు. ఇక కేసిఆర్ మీద ఉన్న పాత కేసులు మహేందర్ రెడ్డే క్లోజ్ చేయించాడని, అందుకే మహేందర్ రెడ్డిని డిజిపిగా అపాయింట్ చేశారన్న ఆరోపణలు కూడా రేవంత్ చేశారు.    ఈ పరిస్థితుల్లో టిఆర్ఎస్ కనుసన్నల్లో పనిచేసే పోలీస్ బాస్ ఇచ్చే సెక్యూరిటీ పట్ల తనకు నమ్మకం లేదన్నారు.  

రేవంత్ రెడ్డి పిటిషన్ ను హై కోర్టు స్వీకరించి కేంద్రానికి ఆదేశాలు జారీ చేయడం టిఆర్ ఎస్ కు  ఎదురు దెబ్బ లాంటిదే అని రాజకీయ వర్గాల్లో టాక్ మొదలైంది.