మూడుసార్లు ఎమ్మెల్యే, 5 వేల కిరాయి ఇంట్లో జీవనం

ఆయన నీతి నిజాయితీకి పెట్టింది పేరు. నిరాడంబరం అంటే కేరాఫ్ అడ్రస్ ఆయనే. మసకబారిపోతున్న కమ్యూనిస్టులకు ఆయన జీవితం కాంతి కిరణం. మూడుసార్లు ఎమ్మల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించినా నయాపైసా జనం సొమ్ము దిగమింగని నైజం ఆయన సొంతం.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రామన్నపేట నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సాధించిన సిపిఐ మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి గురించి తెలిస్తే ఎంతటివారైనా ముక్కు మీద వేలేసుకుంటారు. ఆయన గురించి కొన్ని మాటలు కింద చదవండి.

ఒక్కసారి సర్పంచ్ అయితే కోట్లు కూడబెట్టిన వాళ్లను చూస్తున్నాం. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే తర తరాలకు తరగని సంపద దోచుకున్నోళ్లు మన కండ్ల ముందే ఉన్నారు. రాజకీయం అంటేనే డబ్బు సంపాదన అన్నట్లు బరితెగించిన లీడర్లను కూడా మనం నిత్యం ఎక్కడో ఒకచోట చూస్తేనే ఉన్నాం. పది పర్సెంట్ కమషన్ గాళ్ల వేధింపులు మనకు తెలుసు. భూకబ్జాలు, చీకటి మాఫియాలు నడిపే లీడర్ల గురించి మనకు బాగా తెలుసు. కానీ నిప్పు లాంటి వ్యక్తిని మనం చూడలేదు. కమ్యూనిస్టు నాయకుడు అంటే ఇట్ల ఉండాలె అన్నట్లుగా రాజకీయాల్లో ఉన్నత విలువలు పాటించారు గుర్రం యాదగిరిరెడ్డి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994లో వరుసగా సిపిఐ తరుపున పోటీ చేసి గెలిచారు గుర్రం యాదగిరిరెడ్డి. గుర్రం యాదగిరి రెడ్డి ఏదో ఆశామాషీ లీడర్ మీద గెలిచినోడు కాదు. తెలంగాణలో ఉద్దండ నాయకుడైనా దివంగత మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గుర్రం యాదగిరిరెడ్డికి ప్రత్యర్థిగా ఉన్నారు.

గుర్రం యాదగిరిరెడ్డి రాజకీయాల మీద తన జీవితాన్ని పెట్టుబడిగా పెట్టారు కానీ నయా పైసా సంపాదించుకోలేదు. కనీసం ఆ యావ కూడా ఆయనకు లేదు. ప్రజా సొమ్ము దిగమింగడంలో నేడు అన్ని రాజకీయ పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. కానీ యాదగిరిరెడ్డి మాత్రం అలా కాదు. అందుకే ఆయనకు కనీసం సొంత ఇల్లు లేదంటే ఎవరూ నమ్మరు. తను, తన భార్య ఇప్పుడు హైదరాబాద్ లోని చంపాపేట లో ఐదువేల రూపాయల కిరాయి ఇంట్లో బతుకుతున్నారు. ప్రజల కోసం జీవితాంతం నిస్వార్థంగా పనిచేసిన యాదిగిరిరెడ్డి ఇప్పుడు రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు.

యాదగిరిరెడ్డికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తులు ఉన్నారు. ఇంకా ఆశ్చర్యపోయే విషయమేమంటే ఆయన తన సంతాననాన్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించారు. ముగ్గురిని ప్రభుత్వ పాఠశాలలో చదివించగా మరో అమ్మాయిని మాత్రం గవర్నమెంట హాస్టల్ లో ఉంచి చదివించారు. ఆయన పెద్ద కొడుకు గుర్రం రాజశేఖరరెడ్డి ప్రస్తుతం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. చిన్న కొడుకు రామ్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు. ఆ ఇద్దరు కొడుకులూ తన తండ్రి చూపిన మార్గంలోనే సమాజ హితం కోసం పాటుపడుతున్నారు.

గుర్రం యాదగిరిరెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచనా ప్రజా సందపను ఇప్పటి కొందరు లీడర్లలాగా దోచుకోకపోవడానికి ప్రధాన కారణం ఆయన నమ్మిన సిపిఐ సిద్ధాంతమే. సిపిఐలో క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా పనిచేశారు యాదగిరిరెడ్డి. అందుకే నయా పైసా కూడబెట్టలేదు. తొలిసారి 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు 12వేల జీతం వచ్చేది. తర్వాత జీతం 15వేలకు చేరింది. ఇక మూడోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన దగ్గర డబ్బుల్లేకపోవడంతో అంతకుముందు ప్రభుత్వం (ఎమ్మెల్యేలకు ఇంటి స్థలాలు కేటాయించి ప్రభుత్వం) ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మేసి ఎన్నికల్లో కొట్లాడారు.

ప్రస్తుతం రాజకీయ విశ్రాంతి తీసుకున్న యాదగిరిరెడ్డి, తన భార్య చంపాపేటలో 5వేల కిరాయి ఇంట్లో  శేష జీవితాన్ని గడుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలకు సర్కారు నుంచి అందే 30వేల రూపాయల పెన్షన్ తో వారు జీవిస్తున్నారు.