టిఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన న్యాయవాదులు

ఎన్నికల వేళ టిఆర్ఎస్  కు ఓటమి స్వాగతం పలికింది.  తెలంగాణ స్టేట్  హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధి పై బిజెపి అభ్యర్ది విజయం సాధించారు. టిఆర్ఎస్ బలపర్చిన గండ్ర మోహన్ రావు పై బిజెపి బలపర్చిన నర్సింహారెడ్డి 2 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ది విజయం సాధించడం పై అంతా హర్షం వ్యక్తం చేశారు. దీంతో నర్సింహారెడ్డి వరుసగా మూడో సారి చైర్మన్ గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా సునీల్ గౌడ్, దుస్తా జనార్దన్ ఎన్నికయ్యారు. వీరిద్దరికి సమానంగా ఓట్లు రావడంతో పదవీ కాలాన్ని సమానంగా పంచుకోనున్నారు. 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టిఆర్ఎస్ కు ఇది పెద్ద షాకింగ్ అని పలువురు నాయకులు తెలిపారు. ఎన్నికల్లో తమదే విజయం అని ధీమాగా ఉన్న  టిఆర్ఎస్ కు హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. 

బార్ కౌన్సిల్ ఎన్నికల పై తెలంగాణ లాయర్ల ఉద్యమ జేఏసీ కన్వీనర్ పిఎన్ అరుణ్ కుమార్ తెలుగు రాజ్యంతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…

“95 శాతం తెలంగాణ న్యాయవాదులు 2014వరకు టిఆర్ఎస్ వెంట ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 100 కోట్ల రూపాయలు లాయర్ల సంక్షేమానికి కేటాయించి వాటిని కమిటికి అప్పగించారు. కానీ వాటిని విడుదల చేయకుండా కమిటి తాత్సారం చేసింది. ఆ కమిటిలో టిఆర్ఎస్ అనుకూలమైన లాయర్లనే నియమించారు. ఈ నాలుగున్నరేళ్లలో ఆ నిధులకు 19 కోట్ల వడ్డీ కూడా వచ్చింది. వాటిని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లాయర్లకు పంచాల్సిన కమిటి అలా చేయకుండా కేవలం కొంత మంది వ్యక్తులకే వచ్చే విధంగా వ్యవహరించారు. దీంతో లాయర్లలో అసంతృప్తి చెలరేగింది.

జిపి, ఏజిపి, పీపీలు, స్టాండింగ్ కౌన్సిల్ నియామకాలలో కూడా టిఆర్ ఎస్ అనుకూలురకు మరియు ఒక వర్గం వారికే ప్రాధాన్యత ఇచ్చి నియామకాలు చేశారు. దాని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కేసులలో ఓడిపోయింది. ఏ మాత్రం అవగాహన లేని వారిని నియమించడం వల్ల అనేక కేసులలో ఓడిపోయి దెబ్బతింది. 

బార్ కౌన్సిల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని టిఆర్ఎస్ ముఖ్యులు, మంత్రులు రంగంలోకి దిగి రాజకీయాలు చేసినా బార్ కౌన్సిల్ లో గెలవలేదు. తీవ్రమైన ఒత్తిడులు తీసుకొచ్చారు. ఎలాగైనా ఎన్నికల ముందు బార్ కౌన్సిల్ లో గెలవాలని వారు ప్రయత్నించిన వాటన్నింటిని తిప్పి కొడుతూ బార్ కౌన్సిల్ లో నర్సింహ్మ రెడ్డి గెలిచారు.

చివరికి బార్ కౌన్సిల్ లో టిఆర్ఎస్ ను గెలిపించుకోవడానికి అడ్వకేట్ జనరల్ కూడా ఎక్స్ అఫిషియో హోదాలో ఓటు వేశారు. అయినా కూడా టిఆర్ఎస్ విజయం సాధించలేకపోయింది. తెలంగాణ ఉద్యమకారులను దూరం పెట్టారు. ఉద్యమకాలం నాటి లాయర్లను కనీసం పట్టించుకోలేదు. ప్రగతి భవన్ కు వెళ్లి కలుద్దామంటే అపాయిట్ మెంట్ ఇవ్వని పరిస్థితి ఉండేది. ప్రభుత్వం ఏ విధంగా కూడా లాయర్లను పట్టించుకోలేదు. దాని ఫలితమే బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలని చెప్పవచ్చు.” 

తెలంగాణ బార్ కౌన్సిల్ అధ్యక్షునిగా ఎన్నికైన నర్సింహ్మా రెడ్డికి న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.