రెండేళ్ళలోపే అధికార పీఠమెక్కుతానంటున్న చంద్రబాబు

‘అధికారంలోకి ఖచ్చితంగా వస్తాం.. రెండున్నరేళ్ళదాకా ఆగేది లేదు.. ఈలోగానే ఎన్నికలొస్తాయ్.. రెండేళ్ళ లోపే అధికార పీఠమెక్కబోతున్నాం..’ అంటూ సొంత నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ‘హై ఓల్టేజ్’ ప్రసంగం చేసేశారు కార్యకర్తల్ని ఉద్దేశించి.

చంద్రబాబు పర్యటనలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు రువ్వేందుకు ప్రయత్నించారట. వారిని పోలీసులు లాక్కెళ్ళారట. ‘తమ్ముళ్ళూ, ఇప్పటిదాకా పోలీసులు రాలేదు. ఎవరో రాళ్ళు పట్టుకొచ్చారట.. వాళ్ళని కాపాడేందుకు పోలీసులు దూసుకొచ్చారు..’ అంటూ చంద్రబాబు, పోలీసుల్ని ఎగతాళి చేయడం గమనార్హం.

కుప్పం నియోజకవర్గంలోనే.. ‘ఎన్టీయార్ కాబోయే ముఖ్యమంత్రి..’ అంటూ ప్రత్యేక జెండాలతో యంగ్ టైగర్ ఎన్టీయార్ రాజకీయ ప్రవేశం కోరుతూ.. ఆ మధ్య హంగామా నడిచింది. ఇదే కుప్పం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభాసుపాలయ్యింది.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, కుప్పం నుంచి గెలిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి కొడాలి నాని ఇటీవల సవాల్ చేసిన సంగతి తెలిసిందే. తాను గెలవడమే కష్టమన్న పరిస్థితుల్లో వున్న చంద్రబాబు, ఏకంగా టీడీపీని అధికారంలోకి తెచ్చేస్తాననడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

అసలు సొంత నియోజకవర్గంలో, సొంత జిల్లాలో చంద్రబాబు గురించి స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారో టీడీపీ ఓసారి అభిప్రాయ సేకరణ చేస్తే బావుంటుందేమో.