Ambati Rambabu Satire: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ప్రభుత్వ కార్యక్రమంలోనే మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ (TDP), పెండెం దొరబాబు (Janasena) మధ్య చోటుచేసుకున్న తోపులాట రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందిస్తూ కూటమి సర్కార్పై సెటైర్లు వేశారు.
అసలేం జరిగింది?
పిఠాపురంలోని పడా (PADA) కార్యాలయంలో మంగళవారం మహిళా సంఘాలకు చెక్కులు, మొబైల్ ఫోన్లు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న ఫ్లెక్సీలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడాన్ని ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
అధికారులను వర్మ నిలదీస్తున్న సమయంలో జనసేన నేత పెండెం దొరబాబు జోక్యం చేసుకున్నారు. “ప్రతి చిన్న విషయాన్ని వివాదం చేయడం సరికాదు” అని దొరబాబు అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఇది కాస్తా ముదిరి ఇరువర్గాల మధ్య తోపులాటగా మారింది. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లడంతో అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
“ఒడ్డు చేరేవరకు వర్మన్న.. ఒడ్డు చేరాక నీ ఖర్మన్న!”
పిఠాపురం ఎపిసోడ్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటుగా స్పందించారు. “పిఠాపురం – పితలాటకం ! @PawanKalyan” అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది.

“ఒడ్డు చేరేవరికి.. వర్మన్న.. ఒడ్డు చేరాక.. నీ ఖర్మన్న !” అని అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేసారు.
ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం శ్రమించిన వర్మను, ఇప్పుడు అధికారం వచ్చాక పక్కనబెడుతున్నారనే అర్థం వచ్చేలా అంబటి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే మిత్రపక్షాల మధ్య సమన్వయం లేకపోవడంపై ఆయన ఎద్దేవా చేశారు.
గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం వర్మ తన సీటును త్యాగం చేసినప్పటి నుంచి పిఠాపురంలో విభేదాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఇటీవల వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలోకి చేరడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అధికారుల ప్రోటోకాల్ విషయంలో వర్మ పదేపదే అసంతృప్తి వ్యక్తం చేయడం, దొరబాబు వర్గం దానిని అడ్డుకోవడం నియోజకవర్గంలో కూటమి భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
ఈ తాజా ఘర్షణతో పిఠాపురం రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు అంబటి రాంబాబు ట్వీట్కు జనసేన, టీడీపీ శ్రేణులు ఎలా ప్రతిస్పందిస్తాయో వేచి చూడాలి.

