Caste Mud : ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, గౌతమ్ సవాంగ్ ఎందుకు అనూహ్యంగా డీజీపీ పదవి నుంచి బదిలీ వేటుకు గురవ్వాల్సి వచ్చింది.? అన్నదానిపై చర్చ జరగడంలో తప్పేమీ లేదు.
చంద్రబాబు హయాంలో పలువురు డీజీపీలుగా పనిచేశారు. అప్పట్లోనూ ఆయా అధికారులపై ఆరోపణలు వచ్చాయి. పదవీ కాలం ముగిశాక కొత్త డీజీపీ రావడం.. లేదంటే, కొన్ని సందర్భాల్లో పదవీ కాలం వుండగానే కొత్త పేరుని డీజీపీ పోస్ట్ కోసం తెరపైకి తీసుకురావడం.. ఇవన్నీ పాలనలో భాగమే.
వైఎస్ జగన్ సర్కారు కూడా సవాంగ్ని బదిలీ చేసి ఆ స్థానంలో రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీగా బాధ్యతలు అప్పగించింది. ఇంకేముంది.? రెడ్డి సామాజిక వర్గానికి అగ్రతాంబూలమంటూ రచ్చ షురూ అయ్యింది. ఇదెక్కడి వింత.? ప్రతిదానికీ కులాన్ని ఆపాదిస్తూ పోతే ఎలా.? రెడ్డి సామాజిక వర్గానికి డీజీపీ పోస్టు దక్కకూడదని విపక్షాలు చెప్పదలచుకున్నాయా.?
నిజానికి, కుల జాడ్యం.. కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు.. ప్రధాన రాజకీయ పార్టీలన్నిటిదీ అదే తీరు. అదే సమయంలో అధికారులు కూడా ‘కుల ఉచ్చులో’ పడిపోతున్నారన్న విమర్శలు లేకపోలేదు.
నిజానికి, ఐపీఎస్ అలాగే ఐఏఎస్ అధికారులు కులాలు, మతాల ప్రాతిపదికన పని చేయరు. కానీ, దురదృష్టం.. ఆయా ఉన్నత అధికారుల చుట్టూ కులం కంపు కొట్టేలా రాజకీయం అత్యంత పతన స్థాయికి దిగజారిపోయింది. ఆ మధ్య రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో జరిగిన ‘కుల పంచాయితీ’ గురించి అందరికీ గుర్తుండే వుంటుంది.
అప్పట్లో నిమ్మగడ్డ విషయంలో వైసీపీ, ఇప్పుడు డీజీపీ విషయంలో టీడీపీ.. ‘కులం’ పేరుతో రచ్చ చేస్తున్నాయన్నమాట.
