ఇదెక్కడి పంచాయితీ.? రాష్ట్రానికి మూడు రాజధానులు.. అలాగే ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా వుంటే బావుంటుందన్న చర్చ ఎందుకు తెరపైకొస్తోంది.? కాదేదీ రాజకీయానికి అనర్హం.! ఔను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే జరుగుతోంది. అమరావతి నుంచి అరసవెల్లికి వెళ్ళి అక్కడ ప్రాంత దేవుడ్ని ఏమని కోరతారు అధ్యక్షా.? అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఉత్తరాంధ్ర మనోభావాల గురించి వైఎస్ జగన్ ప్రస్తావించిన తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
మనోభావాలు కేవలం రాజధాని కోసమే వుంటాయా.? ముఖ్యమంత్రి పదవి కోసం వుండవా.? అన్న చర్చ ఉత్తరాంధ్రలో జరుగుతోందిప్పుడు. అమరావతి రైతులు తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి రాయలసీమ ప్రాంత దేవుడిగా ఎవరికీ కనిపించలేదు. కానీ, అరసవెల్లికి అమరావతి రైతులు వెళుతున్నప్పుడు సూర్యనారాయణస్వామి అనే దేవుడికి ప్రాంతీయత వచ్చేసింది.
ఉత్తరాంధ్ర, రాయలసీమ.. ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. అదే సమయంలో ఆయా ప్రాంతాలకు ప్రత్యేకమైన గుర్తింపు కూడా వుంది.. యాస, పద్ధతుల పరంగా. అలాగని, ప్రాంతాల వారీగా ప్రజల్ని విడదీస్తామంటే ఎలా.? ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఈ ప్రాంతీయ వాదం వల్లనే విభజన వచ్చింది. ఇప్పుడు ఇంకోసారి అలాంటి విభజన.. అంటే, నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ మరింత నష్టపోవడం ఖాయం.
ముగ్గురు ముఖ్యమంత్రులు కాదు.. ఒకే ముఖ్యమంత్రి వున్నా, పలువురు ఉప ముఖ్యమంత్రులున్నారు. అయితే, ఆయా ఉప ముఖ్యమంత్రుల వల్ల ఆయా ప్రాంతాలకు ఒరిగిన అదనపు ప్రయోజనమేమీ లేదు. సకల శాఖల మంత్రి.. అన్న పేరు అసలు మంత్రే కాని సజ్జల రామకృష్ణారెడ్డికి వుంది. ‘వైఎస్ జగన్ అనాలోచిత ప్రకటన చేశారు సీపీఎస్ మీద..’ అనగలిగే స్థాయి సజ్జలకు వుంది మరి.!
ఏదిఏమైనా, రాజదాని అమరావతి అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవాంఛనీయమైన చర్చకు తావిస్తోంది. ఈ వివాదం ఎప్పటిదాకా కొనసాగుతుందోగానీ, వివాదం ముగిసేదాకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది కల్ల.!
