నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘అఖండ’ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. సినిమా టైటిల్తోపాటు విడుదలైన టీజర్, కొత్త వివాదాలకు తెరలేపింది. ‘నంది.. పంది..’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ఎవర్ని ఉద్దేశించి.? అన్నదే ఇప్పుడు ఆస్తకికరం. సినిమా డైలాగుల్ని, కేవలం సినిమాల కోసం రాసిన డైలాుగులుగానే చూసే రోజులెప్పుడో పోయాయ్. పైగా, బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటే, ఆ సినిమాలోని డైలాగులకు, రాజకీయ రంగు ఖచ్చితంగా అంటుకుంటుంది. ‘రంగు మార్చిన పంది’ అని బాలయ్య అనడం ఓ రాజకీయ నాయకుడి మీద సెటైర్.. అంటున్నారు. టీడీపీకి చెందిన ఆ నాయకుడు, ఆ పార్టీని వీడి, వేరే పార్టీలో చేరి.. చంద్రబాబుని తిట్టిన తిట్టు తిట్టకుండా (బూతులు కూడా తిట్టేస్తున్నాడు) తిడుతున్న దరిమిలా, ఆ నాయకుడ్ని ఉద్దేశించే బాలయ్య అంత పెద్ద డైలాగు తన సినిమాలో పెట్టించాడని అంటున్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీనుకి కూడా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలున్నాయి. చంద్రబాబు కోసం గతంలో బోయపాటి చాలానే చేశాడు. ఇప్పుడు ఇంకాస్త గట్టిగా ‘అఖండ’ సినిమాతో చేయబోతున్నాడని అనుకోవాలేమో. ‘అఖండ్’ సినిమాకి సంబంధించి గతంలో విడుదలైన ఓ డైలాగ్ కూడా సదరు నాయకుడ్ని ఉద్దేశించినదేనని అంటున్నారు. ‘మీ నాన్నగారు.. మీ అమ్మ మొగుడు.. శ్రీనుగారూ.. లమిడీ కొడకా..’ అంటూ సాగుతుంది ఆ డైలాగు. సదరు నాయకుడు, ఒకప్పుడు టీడీపీలో వుంటూ, స్వర్గీయ నందమూరి తారకరామారావు కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించాడట. పైగా, బాలయ్యబాబుకి భక్తుడిగా, వీరాభిమానిగా వుంటూ పార్టీలో ఎదిగాడట. టీడీపీ అభిమానులు ఇదే విషయాన్ని చెబుతూ, సదరు నేత మీద సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.. బాలయ్య డైలాగుని అతనికి ఆపాదిస్తున్నారు కూడా. కానీ, సినిమా వర్గాలు మాత్రం.. సినిమాలోని సన్నివేశానికి తగ్గ డైలాగే తప్ప, ఎవర్నీ ఉద్దేశించి కాదని చెబుతుండడం గమనార్హం.