AP: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటనలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఈయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీ సాధించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యతలు తీసుకోవడమే కాకుండా డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు.
చాలా రోజుల తర్వాత తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ఈయన పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.కూటమి ప్రభుత్వ నాయకులమంతా సమన్వయంతో.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి పని చేస్తున్నామన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.
ఇక రైతులకు వ్యవసాయ పనిముట్లతో పాటు మహిళలకు కుట్టు మిషన్లను కూడా అందజేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలోనే పిఠాపురం అభివృద్ధికి 100 కోట్లు విడుదల చేశామని తెలిపారు 30 పడకల ఆసుపత్రిని కాస్త వంద పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దబోతున్నామని తెలిపారు.
నియోజకవర్గ ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో ఎక్కడ రాజీ పడే అవకాశం లేదని పవన్ తెలిపారు. సొంత పార్టీ కార్యకర్తలే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఉపేక్షించేది లేదని తప్పనిసరిగా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.