Then 1 Cr : అప్పుడు కోటి.! ఇప్పుడు పాతిక లక్షలు.! ఈ లెక్కలేంది జగన్ సారూ.!

Then 1 Cr : పారిశ్రామిక ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినవారందరికీ కోటి రూపాయల నష్ట పరిహారం సాధ్యమయ్యే పనేనా.? కానీ, తప్పదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించారు కాబట్టి, అలాంటి ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో బాధిత కుటుంబాలు అదే కోటి రూపాయలు, అంతకు మించి ఆశించడంలో తప్పేముంది.?

సాధ్యాసాధ్యాలు వేరు.. పరిస్థితులు వేరు. సెంటిమెంట్లు వేరు. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. వైసీపీ కూడా ప్రతిపక్షంలో వున్నప్పుడు రాజకీయే చేసింది.. ఇప్పుడూ రాజకీయమే చేస్తుంది. ఇకపైనా రాజకీయమే చెయ్యాలి.

టీడీపీ కావొచ్చు, జనసేన కావొచ్చు.. కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాల్సిందేనంటూ ఏలూరు ఘటనపై డిమాండ్ చేస్తే, దాన్ని తప్పు పట్టడానికి వీల్లేదు.

ఏలూరు జిల్లాలో ఓ పరిశ్రమలో పేలుడు సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అత్యంత విషాదకర ఘటన ఇది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాతిక లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు మృతుల కుటుంబాలకి.

కానీ, కోటి రూపాయలు ప్రకటించాలంటూ జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది.

ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కోటి అన్నారు గనుక, అదే కోటిని ఇక్కడ కూడా వర్తింపజేయక తప్పని పరిస్థితి వైఎస్ జగన్ సర్కారుది. చేస్తుందా.? లేదా.? చెయ్యకపోతే మాత్రం ప్రజల్లో  వైసీపీ సర్కారు అభాసుపాలైపోతుంది.

అయినా ప్రమాదం జరిగాక, ప్రాణాలు పోయాక నష్టపరిహారమో ఆర్థిక సాయం చేయడమో తప్పదుగానీ.. అసలంటూ ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వమెందుకు కఠిన చర్యలు తీసుకోలేకపోతోందన్నదే అసలు ప్రశ్న.