AP Railways : సిల్లీ సమాధానం: ఆంధ్రప్రదేశ్ 360 కోట్లు ఇవ్వలేకపోతోందా.?

AP Railways : సంక్షేమ పథకాల కోసం వేల కోట్లు ఖర్చవుతున్నాయి.. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకూ పెద్దయెత్తున ఖర్చవుతోంది. అలాంటిది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన వందల కోట్ల నిధులు వెచ్చించలేకపోతోందా.? కేంద్రం రాష్ట్రంలో పూర్తవ్వాల్సిన రైల్వే ప్రాజెక్టుల ఆలస్యంపై ‘కుంటి సాకు’ చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది.

కోనసీమ వాసులు ఎన్నో దశాబ్దాలుగా కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైన్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని అంతా సంబరపడుతున్నవేళ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ లైన్ పూర్తయితే, రైల్వేకి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కోనసీమ నుంచి కార్గో పరంగా కూడా రైల్వే శాఖకు వచ్చే ఆదాయం చాలా ఎక్కువేనని గతంలోనే అంచనా వేశారు.

ఇంతటి ప్రత్యేకమైన ఈ రైల్వే మార్గాన్ని పూర్తి చేయలేకపోవడమంటే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే.

రైల్వే ప్రాజెక్టులు చేపట్టేది, పూర్తి చేసేది కేంద్రమే. అయితే, రాష్ట్రాలూ కొంత వాటా భరించి, కొన్ని ప్రత్యేక రైల్వే లైన్లను పూర్తి చేయిస్తుంటాయి. ఆ లెక్కన ఈ రైల్వే లైన్ కోసం జగన్ సర్కార్ 360 కోట్లు ఖర్చు చేయలేకపోతోందంటే, అదెలా నమ్మగలం.?

పోనీ, ఆ 360 కోట్ల రూపాయల్ని కేంద్రం వెచ్చించలేదా.? విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి కేంద్రం వివిధ రూపాల్లో పెద్దయెత్తున సాయం అందించాల్సి వుంది. కానీ, అలాంటివేవీ చేయని కేంద్రం, రైల్వే ప్రాజెక్టునైనా పూర్తి చేయొచ్చు కదా.? కేంద్రం నిర్లక్ష్యం సరే, రాష్ట్ర ప్రభుత్వమెందుకు ఈ విషయమై కేంద్రాన్ని నిలదీయలేకపోతోందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.