Gautam Reddy’s Death : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణానికి గురవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అత్యంత సన్నిహితుడ్ని కోల్పోయానంటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అతి కొద్దిమంది మాత్రమే వివాద రహితులు వుంటారనీ, అలాంటి అతి కొద్దిమందిలో గౌతమ్ రెడ్డి కూడా ఒకరని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎప్పుడూ ఫిట్గా కనిపించే గౌతమ్ రెడ్డి గుండెపోటుతో చనిపోవడమేంటి.? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవల కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనను ఇప్పుడు మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం ఘటనతో పోల్చుతున్నారు చాలామంది.
కాగా, ఇటీవల దుబాయ్ వెళ్ళిన మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నిన్ననే ఆయన హైద్రాబాద్ చేరుకున్నారు దుబాయ్ నుంచి. ఇంతలోనే ఆయన హఠాన్మరణం చెందారు.
ఇదిలా వుంటే, ఈ మధ్యనే మేకపాటి గౌతమ్ రెడ్డి కోవిడ్ బారిన పడ్డారనీ, కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ, పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఆయన గుండెపోటుకు గురై వుంటారనే చర్చ సర్వత్రా జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో గౌతమ్ రెడ్డి అత్యంత సౌమ్యుడిగా, చురుకైన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా, వ్యక్తిగతంగా తనపై ఎవరెన్ని విమర్శలు చేసినా సౌమ్యంగా వ్యవహరిస్తుంటారాయన.
తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న గౌతమ్ రెడ్డి, తండ్రి తరహాలోనే అజాత శతృవు అనిపించుకున్నారు.
