Police Cases Trashed : కేసులెత్తేసి, ఏం సంకేతాలు పంపుతున్నట్టు.?

Police Cases Trashed : రైలుని తగలబెట్టడమంటే చిన్న విషయమా.? చంద్రబాబు హయాంలో ‘కాపు ఉద్యమం’ ముసుగులో కొందరు, తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఓ రైలుని దహనం చేసేశారు. అప్పట్లో ఈ ఘటనపై చాలా రాజకీయ దుమారమే చెలరేగింది. టీడీపీ – వైసీపీ మధ్య ఆరోపణల పర్వం నడిచింది. పలువురు వైసీపీ నేతల మీద కేసులు నమోదయ్యాయి.

చంద్రబాబు పాలన ముగిసింది.. వైఎస్ జగన్ పాలన షురూ అయ్యింది. చంద్రబాబు హయాంలో నమోదైన కేసుల్ని చాలావరకు వైఎస్ జగన్ హయాంలో ఎత్తేశారు, ఇంకా ఎత్తేస్తూనే వున్నారు. తాజాగా సుమారు 160 కేసుల్ని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా ఈ ఘటనకు సంబంధించి కొన్ని కేసులున్నాయి.. అవీ రానున్న రోజుల్లో ఎత్తివేయబడతాయేమో.

ఇలా కేసులు ఎత్తివేయడం ద్వారా సభ్య సమాజానికి ప్రభుత్వం ఏం సందేశం ఇస్తున్నట్లు.? కొన్నాళ్ళ క్రితం పలువురు వైసీపీ నేతల మీద వివిధ ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్ని ఎత్తివేయడం వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. ఆ ‘ఎత్తివేత’పై కొందరు న్యాయస్థానాల్ని ఆశ్రయించారు కూడా.

ఇక, ఇప్పుడు.. వైసీపీ హయాంలో పలువురు నెటిజన్లపైనా, రాజకీయ నాయకులపైనా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఈ కేసులన్నీ వచ్చే ప్రభుత్వంలో ఎత్తివేయబడతాయా.? అలాగైతే, పోలీసు వ్యవస్థ వున్నదెందుకు.? ఇప్పుడు ఇదే చర్చ సర్వత్రా జరుగుతోంది.

అయితే, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నమోదైన తప్పుడు కేసులే ఎత్తివేయడం జరుగుతోందన్నది వైసీపీ నేతలు తాజా పరిణామాలపై చేస్తున్న వ్యాఖ్యల సారాంశం. మరి, ఇదే కుంటి సాకు చూపుతూ, వచ్చే ప్రభుత్వం కూడా కేసులు ఎత్తివేయడం ఖాయమేనన్నమాట. అంటే, పోలీసు వ్యవస్థ మొత్తంగా ‘బకరా’ అయిపోతోందన్నమాట ఈ కేసులకు సంబంధించి.