Pawan’s Silence : పవన్ వ్యూహాత్మక మౌనం, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతున్న వైనం

Pawan’s Silence :  బీజేపీ ఏదో రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి. అదేంటో ఇప్పటిదాకా బీజేపీ బయటపెట్టలేదు. ఇచ్చేశామని ఓసారి, ఇస్తామని ఓ సారి బీజేపీ నేతలు చెబుతున్నారు.

జనసేన పార్టీ మాత్రం చీకట్లో రాయి విసిరి చోద్యం చూస్తోంది. నిజమే మరి, వైసీపీ గింజుకుంటోంది.. టీడీపీ విలవిల్లాడుతోంది.. బీజేపీ గందరగోళంలో పడింది.. వెరసి, జనసేనాని వ్యూహం ఫలించినట్లే.

టీడీపీతో జనసేన కలుస్తుందా.? లేదా.? టీడీపీతో కలవడానికి బీజేపీ ఒప్పుకుంటుందా లేదా.? ఇలా సాగుతోంది టీడీపీలో గందరగోళం. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయాలా.? ఆయన్ని కలుపుకుపోవాలా.? అన్నదీ అర్థం కావడంలేదు టీడీపీ నేతలకి.

టీడీపీ 135 సీట్లలో పోటీ చేస్తుంది. జనసేనకు 30 సీట్లు.. మిగిలినవి బీజేపీకి.. ఇలా అప్పుడే టీడీపీ నుంచి పంపకాలు లీకుల రూపంలో జరిగిపోతున్నాయి. కానీ, అధికారంలోకి వచ్చేది తామేనని జనసేన గట్టిగా చెబుతోంది. పవన్ కళ్యాణ్‌దే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం.. అని బీజేపీ కూడా చెబుతుండడం గమనార్హం?

ఒకవేళ టీడీపీ – జనసేన కలిస్తే రాజకీయ సమీకరణాలు ఏమైనా తమకు వ్యతిరేకంగా మారతాయా.? అన్నదానిపై వైసీపీలో అంతర్గతంగా చాలా చర్చ జరుగుతోంది. పైగా, జనసేనాని ఎలాంటి రోడ్ మ్యాప్ బీజేపీ నుంచి ఆశిస్తున్నారో వైసీపీకి అర్థం కావడంలేదు.

ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీలను బీజేపీ దెబ్బ తీస్తున్న బీజేపీ వ్యూహాల్ని వైసీపీ ఇప్పటికే అధ్యయనం చేయడం మొదలు పెట్టింది.

ఏపీలో జనసేన చుట్టూ ఇంత రచ్చ జరుగుతోంటే, జనసేనాని మాత్రం గుళ్ళూ గోపురాలూ తిరుగుతున్నారు.. తన సినిమా పనుల్లో ఎంచక్కా బిజీ అయిపోయారు.