Son Killed Mother: ఆస్తి కోసం కన్న తల్లిని కడతేర్చిన కసాయి కొడుకు..!

Son Killed Mother: ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య ప్రేమాభిమానాలు కరవై పోయాయి. రక్తసంబంధీకులు కూడా ఎవరికి వారే అన్నట్టు ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు. కానీ ప్రపంచంలో తల్లీ బిడ్డకు మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. తల్లి తన బిడ్డల కోసం ఎన్నో త్యాగాలను చేస్తుంది. అటువంటి తల్లిదండ్రులు వయసు అయిపోయిన తర్వాత బిడ్డల దగ్గర సరైన ఆదరణ లేక బాధపడుతున్నారు. ప్రపంచం మొత్తం డబ్బుతో ముడి వేసుకొని ఉంది. డబ్బు కోసం ప్రస్తుతం ఎటువంటి నీచానికైనా దిగజారటానికి వెనుకాడటం లేదు.

తాజాగా ఆస్తికోసం కన్నతల్లిని కడతేర్చాడు ఒక కొడుకు. వివరాలలోకి వెళితే..సంగారెడ్డి జిల్లాలోని వట్‌పల్లి మండలం పోతులబోగుడా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఎస్ ఐ దశరథ్ వెల్లడించిన వివరాల ప్రకారం పోతులబోగుడా గ్రామానికి చెందిన మొండి మల్లమ్మ పేరు మీద నాలుగు ఎకరాల పొలం కొత్త బంగారు ఉంది. అయితే ఆమె కన్నకొడుకు వాటి మీద కన్ను వేసి ఆస్తిని తన పేరున రాయలేదని రోజు తాగి వచ్చి గొడవ చేసేవాడు. ఎలాగైనా తన తల్లి దగ్గర నుండి ఆస్తి తన సొంతం చేసుకోవాలని పథకం వేసి పెళ్లాన్ని పుట్టింటికి పంపించాడు.

బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎవరూ లేని సమయం చూసి తల్లిని గొంతు నులిమి చంపి ఏమీ ఎరగనట్టు తన తల్లి అనారోగ్యం వల్ల మృతి చెందిందని చుట్టుపక్కల వారిని నమ్మబలికాడు. కానీ చుట్టు పక్కల వారికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. జోగిపేట సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మృతురాలి అల్లుడు జనార్ధన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. ఆస్తి కోసం కన్నకొడుకే క్రూరంగా కన్నతల్లిని చంపేశాడు. నవమాసాలు మోసి కానీ పెంచిన పాపానికి ఆ తల్లికి తన కొడుకే కాలయముడయ్యాడు.