వైఎస్ జగన్ మాత్రమే ‘వల్గర్ నాయకుల్ని’ ప్రోత్సహిస్తున్నారా.?

‘మీ పద్ధతేమీ బాగా లేదు.. టీడీపీ ఆరోపణలపై కౌంటర్ ఎటాక్ సరిగ్గా లేదు..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇటీవల క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులపై మండిపడ్డారట. అలాగని మీడియాలో కథనాలు వచ్చాయి. వైసీపీ అనుకూల మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఆ వెంటనే, వైసీపీలో కొందరు ‘కీలక’ నేతలు యాక్టివ్ అయ్యారు. వల్గర్ లాంగ్వేజ్ షురూ అయ్యింది. మీడియా ప్రతినిథులు చెవులు మూసుకోవాల్సి వస్తోంది వైసీపీ నేతలు మాట్లాడుతోంటే. దానికి ఏమాత్రం తగ్గకుండా టీడీపీ కూడా అంతే స్వరంతో వల్గర్ లాంగ్వేజ్ వాడుతోంది.

నిజానికి, ఇదేమీ కొత్త కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నేతలు ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారు. కానీ, ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పు వచ్చింది. ఒకరిద్దరు నేతలు మినహా, తెలంగాణలో వల్గారిటీ స్థాయి తగ్గింది రాజకీయ విమర్శల పరంగా. కానీ, ఏపీలోనే అత్యంత జుగుప్సాకరంగా తయారైంది పరిస్థితి.

ముఖ్యమంత్రి మీద టీడీపీ నేతలు కొందరు అత్యంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. దానికి వైసీపీ నుంచి కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఎటాక్ వస్తోంది. కొందరు టీడీపీ నేతల్ని, కొందరు వైసీపీ నేతల్ని.. ఆయా పార్టీల నేతలు ప్రత్యేకంగా బూతులు మాట్లాడటానికే నియమించారా.? అన్నట్లు మారింది పరిస్థితి.

అధికారంలో వున్న పార్టీ గనుక, వైసీపీనే కొంత సంయమనం పాటించాలి. వైసీపీ నేతలు సంయమనం కోల్పోతే, ఆ ఇంపాక్ట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదా, వైసీపీ ప్రభుత్వం మీదా చాలా గట్టిగా పడుతుంది. వైసీపీ పాలన ఎలా వున్నా, రాజకీయాల్లో వల్గారిటీని ప్రమోట్ చేస్తున్న పార్టీగా వైసీపీ మీద ముద్ర పడిపోయే ప్రమాదం లేకపోలేదు.

వైఎస్ జగన్ ఇలాంటివాటిని ప్రోత్సహిస్తారని అనుకోలేం. కానీ, అధినేత మెప్పు కోసం అదుపు కోల్పోతున్నవారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదనే వుంది. చంద్రబాబు సంగతంటారా.. టీడీపీ ఖేల్ ఖతం అయిపోయిన స్థితిలో వుంది. ఆ టీడీపీతో బూతుల విషయంలో పోటీ పడితే, వైసీపీ కూడా అదే స్థాయికి పడిపోవడం ఖాయం.