టీడీపీని చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా భ్రష్టు పట్టించారని అంటుంటారు టీడీపీ మాజీలు. ఇన్నేళ్ల చంద్రబాబు సారథ్యంలో పార్టీ స్వరూపమే మారిపోయిందని, ఆనాడు ఎన్టీఆర్ పెట్టిన టీడీపీకి ఇప్పుడున్న టీడీపీకి పోలికే లేదని పెదవి విరుస్తుంటారు. 2019 ఎన్నికల ఫలితాలను గుర్తు చేసుకుంటే అదే నిజమని, ఒకప్పుడు టీడీపీ ఎక్కడ ఇప్పుడున్న టీడీపీ ఎక్కడ అనిపించక మానదు. అన్నగారు ఏయే లక్ష్యాలతో టీడీపీని స్థాపించారో వాటన్నింటినీ తుంగలో తొక్కేసిన బాబు ఇంకొక్క పని చేస్తే పార్టీని బంగాళాఖాతంలో కలిపేసినట్టే అవుతుంది. అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు.
ఆ ఘనకార్యాన్ని కూడ బాబు త్వరలోనే చేయనున్నారని అనిపిస్తోంది. ఎందుకంటే పరిస్థితులు అలాంటివి మరి. గత ఎన్నికల్లో ఓటమిపాలైన చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా బరిలోకి దిగకూడదని డిసైడ్ అయ్యారు. అందుకే పొత్తు కోసం ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ, జనసేనలను కలుపుకోవాలని బాబుగారి తపన. ఎందుకంటే వారిది హిట్ కాంబినేషన్. 2014లో అధికారంలోకి రావడానికి ఆ కూటమి బలమే రీజన్. అందుకే ఎలాగైనా బీజేపీతో కలవాలని డిసైడ్ అయ్యారు. కానీ బీజేపీ ససేమీరా అంటోంది. బాబుకు అన్ని తలుపులు మూసేశామని కుండబద్దలు కొట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ లొంగకపోవడంతో బాబు ఇంకో ప్లాన్ రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది.
అదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్, టీడీపీలకు వైసీపీ ఉమ్మడి శత్రువు. శత్రువుకి శత్రువు మనకు మిత్రుడే కదా అనే ఫార్ములాను ఫాలో అవుతున్నారట. బీజేపీ గనుక మనసు మార్చుకుని టీడీపీతో కలిసి నడవడానికి సిద్దపడితే సరే లేకుంటే టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి రెడీ అవుతుంది. అదే జరిగితే టీడీపీ ఆత్మ మీదే దెబ్బకొట్టినట్టు. కాంగ్రెస్ పార్టీ నిరంకుశత్వాన్ని భరించలేకే ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని పెట్టారు. అలాంటిది బాబుగారు వెళ్లి వాళ్లతోనే స్నేహం చేస్తే అది దారుణమే అవుతుంది. ఇప్పటికే ఈ దారుణాన్ని గత తెలంగాణ ఎన్నికల్లో చేసిన చంద్రబాబు చేదు ఫలితాలనే మూటగట్టుకున్నారు. ఇక్కడ కూడ కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంటే సేమ్ రిజల్ట్ ఖాయం. ఓటమి మాత్రమే కాదు పార్టీ ప్రతిష్ట సైతం పూర్తిగా మంటగలిసి పార్టీ చివరి దశకు చేరుకున్నా ఆశ్చర్యం లేదు.