వినండి వినండి.! సరికొత్త ప్రకటన ఇది.! రేపు అసెంబ్లీలో బిల్లు పెడతాం (ఏదో రేపు అనే మాట యధాలాపంగా వచ్చిందంతే.. ఈ సెషన్స్లో పెడతారో, వచ్చే సెషన్స్లో పెడతారో క్లారిటీ ఇవ్వలేదు..) వచ్చే విద్యా సంవత్సరం నాటికి విశాఖ నుంచే పరిపాలన సాగుతుంది, అక్కడికి వచ్చేయండంటూ జర్నలిస్టులకు మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచించారు.
ఆలూ లేదు, చూలే లేదు.. కొడుకు పేర సోమలింగమన్నాడట వెనకటికి ఎవడో.! అలా వుంది విశాఖ రాజధాని పరిస్థితి. ఎలా.? రాజధానిని విశాఖకు ఎలా తరలిస్తారు.? కోర్టుల్లో కేసులున్నాయ్. అసెంబ్లీలో ఇంకా మూడు రాజధానుల విషయమై కొత్త బిల్లు పెట్టలేదు. పెట్టినా, అదేమవుతుందో తెలియదు.
కానీ, అదిగదిగో రాజధానిగా విశాఖ.. అంటున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. మొన్నీమధ్యనే, ‘మేం మా మేనిఫెస్టోలో మద్య నిషేధం అనే మాటే చెప్పలేదు..’ అంటూ ఇదే మంత్రి సెలవిచ్చారు. రేప్పొద్దున్న, ‘నేనెప్పుడు చెప్పాను రాజధానిగా విశాఖ అని..’ అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట మార్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఏమో, ఈ అసెంబ్లీ సెషన్లలోనే మూడు రాజధానుల బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందేమో. పెట్టకపోతే, రానున్న రోజుల్లో ఎప్పుడో ఒకప్పుడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి అయినా ఆ పని పూర్తి చేయొచ్చు. అధికారం తమ చేతుల్లో వుంది గనుక, వైసీపీ ఏదైనా చేయాలనుకుంటే చేసెయ్యొచ్చు.
కానీ, ఆ తర్వాత పరిణామాల సంగతేంటి.? అమరావతి మాటేమిటి.? కర్నూలు సంగతేంటి.? విశాఖ నుంచి పరిపాలన అంటే అంత తేలికైన వ్యవహారం కాదు. దానికి చాలా వ్యవహారాలుంటాయ్. రాజధానికి సంబంధించి ప్రభుత్వ కార్యాలయాల ఎంపిక.. ఇలా చాలా వ్యవహారాలుంటాయ్.
