ప్రతీ ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా ‘1948 అఖండ భారత్’

చిత్రం : 1948 అఖండ భారత్రే
రేటింగ్:   3.25/5
దర్శకత్వం:  ఈశ్వర్ బాబు.డి
నిర్మాత : ఎం.వై.మహర్షి ( సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ )
విడుదల తేది : 12 ఆగస్టు 2022
నిర్మాణం : ఎం.వై.ఎం క్రియేషన్స్న
నటీ నటులు : రఘనందన్, డా. ఆర్యవర్ధన్ రాజ్, శరద్ దద్భావల, మొహమ్మద్ ఇంతియాజ్, జెన్నీ, సమ్మెట గాంధీ తదితరులు.
1948 అఖండ భారత్’ (1948 Akhanda Bharath) అనే టైటిల్ తో సినిమా వస్తుందంటేనే భారతీయుల్లో.. ముఖ్యంగా దేశభక్తుల్లో ఎనలేని ఉత్సాహం పొంగి పరవళ్లు తొక్కుతుంది. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అన్ని భారతీయ బాషలతోపాటు, ముఖ్యమైన అంతర్జాతీయ భాషల్లోనూ విడుదలై అందర్నీ ఆలోచనలో పడేసింది. గాంధీ హత్యోదంతంపై నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..
కథలోకి వెళితే
బ్రిటీష్ పాలకులు భారత దేశానికి స్వాతత్య్రం ప్రకటించిన అనంతరం దేశవిభజన జరిగి… హిందూ, ముస్లింల మధ్య మతకలహాలు జరిగి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది పాకిస్తాన్ నుంచి కాందిశీకులుగా భారత దేశానికి వచ్చేశారు. దానికి ప్రతీకారంగా ఇండియాలో ఉన్న ముస్లింల పైనా దాడులు జరిగాయి. ఈ మత కల్లోలాను ఆపి… విభజన సమయంలో పాకిస్తాన్ కి ఇస్తామని హామీ ఇచ్చిన  రూ.55 కోట్లు ఇవ్వాలని ఢిల్లీలోని బిర్లా హౌస్ లో గాంధీ నిరాహార దీక్ష ప్రారంభిస్తారు. ఈ నిరాహార దీక్ష …. కొంత మంది హిందూ మహాసభ సభ్యులకు ఎలా ఆగ్రహం కలిగించింది? అందులో ముఖ్య సభ్యులైన వీర సావర్కర్ శిష్యులు నాదూరమ్ గాడ్సే, నారాయణ ఆప్టే అండ్ మిత్ర బృందం గాంధీని చంపడానికి ప్రేరేపించిన అంశాలు ఏవో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణలోకి… 
దేశ విభజన వల్ల భారతదేశం భౌగోళకంగా… ఆర్థికంగా… సామాజికంగా…. సాంస్కృతికంగా చిన్నాభిన్నమైనది. అందుకు కారణం అప్పటి బ్రిటీష్ పాలకులు ఓ కారణం కాగా… మరో వైపు అప్పటి కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులు. వారితో పాటు అహింసా వాది అయిన జాతిపిత గాంధీ. శాంతి… శాంతి అంటూ ఓ వైపు పాకిస్తాన్ కి వంత పాడటం వల్ల ఆయన ప్రాణాలనే వొదలాల్సి వచ్చిందని గాడ్సే వాదుల వాదన. 1948 అఖండ భారత్ లో రచయిత ఇందులో అదే చూపించారు. అహింసా వాది, సత్యాగ్రహి అయిన గాంధీ హత్యకు 45 రోజుల ముందు నుంచి జరిగిన పరిణామాలు, ఆయన మరణానంతరం జరిగిన ఇన్వెస్టిగేషన్ అన్నీ ఇంట్రెస్టింగ్ గా వున్నాయి. గాంధీ హత్య కేసులో ఊరి తీయబడ్డ నాధు రామ్ గాడ్సే, నారాయణ అప్టేల మృత దేహాలను దహనం చేసిన ప్లేస్ లో అమర వీరుల స్తూపాలు నిర్మిస్తారని భావించి, ఎవరికీ తెలియకుండా దహనం చేయడం లాంటి భావోద్వేగ అంశాలు ఎంతో హృద్యంగా తెరపై చూపించాడు దర్శకుడు. దేశ విభజన సమయంలో జరిగిన కొన్ని మూలన పడిన సంఘటనలు ఈతరం యువతకి తెలిసేలా వుంది.
ఎవరెలా చేశారంటే..
ఈ ‘1948 అఖండ భారత్’ చిత్రంలో  గాంధీ పాత్రలో రఘనందన్ (Raghu Nandhan) విశేషంగా ఆకట్టుకున్నాడు.తన  హావ భావాలు, డైలాగ్ డెలివరీ అన్నీ చక్కగా కుదిరాయి. ఈ క్యారెక్టర్ లో రఘనందన్ ను చూసిన ప్రేక్షకులు వాహ్.. రఘనందన్ అని మెచ్చుకోకుండా ఉండలేరు.  ఇక కీలక రోల్ నాథురాం గోడ్సే గా డా. ఆర్యవర్ధన్ రాజ్(Arya Vardhan Raaz) మెప్పించాడు.  ఎందుకంటే ఈ పాత్రకి గాంధీ లాగ పెద్దగా రిఫరెన్స్ కూడా మనకి చరిత్రలో కనిపించవు. గాంధీని హత్య చేసిన హంతకుడిలాగే మనం చదవడం కానీ, వినడం కానీ చేశాం. ఇందులో అయితే గాడ్సే ఓ అభ్యుదయ భావాలు వున్న బ్రాహ్మణ యువకునిగా గాడ్సే ఎంత అగ్రెసివ్ గా ఉండేవారో ఆర్య వర్ధన్ రాజ్ బాగా చేసి చూపించారు అందం కంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. అంతే కాదు..  క్లైమాక్స్ కోర్ట్ సీన్ లో భావోద్వేగంతో చెప్పిన డైలాగులు చాలా కన్వెన్సింగ్ గా వున్నాయి. నారాయణ అప్టే పాత్రధారి బాగా ఆకట్టుకున్నాడు.  సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రుగా  మొహమ్మద్ ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఆయా పాత్రల్లో వాళ్ళు చూపిన హావభావాలు, నటనలో ఎంతో అనుభవం ఉన్న నటులను తలపించాయి.
ఇక దర్శకుడి విషయానికొస్తే.. ఆర్య వర్ధన్ రాజ్ ఎంతో రీసెర్చ్ చేసి రాసిన కథ, కథనాలను దర్శకుడు ఈశ్వర్ డి.బాబు తెరమీద బాగా చూపించారు. ఎక్కడా తొట్రుపాటుకు గురిఅవ్వకుండా దర్శకుడు ఈశ్వర్ డి.బాబు సినిమాను తెరకెక్కించిన విధానం మనసుల్ని గెలుచుకుంటుంది.  ప్రజ్వల్ క్రిష్ అందించిన సంగీతం బాగుంది. చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ ఎంతో రిచ్ గా వుంది. 1948 నాటి పరిస్థితులను బాగా చిత్రీకరించారు. అందుకు తగినట్టుగా ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాత ఎం. వై. మహర్షి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను ఎంతో క్వాలిటీగా నిర్మించారు. సినిమా అంటే… ఎలా ఉండాలి అనిపిస్తుంది. నేటితరం  యువత తప్పకుండా చూడాల్సిన సినిమా ‘1948 అఖండ భారత్’.. యువతరమే  కాదు.. ప్రతీ ఒక్క భారతీయుడు తప్పకుండా చూసి గర్వపడాల్సిన సినిమా.
ఇది.

-ఎం.డి. అబ్దుల్