టీడీపీ కోటలకు బీట‌లు కాదు..పునాదే లేకుండా చేస్తారా?

టీడీపీ నేత‌ల‌పై అరెస్ట్ ల‌పై ప‌ర్వం కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లైన అచ్చెన్నాయుడు, జేసీప్ర‌భాక‌ర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి లు అరెస్టై జైళ్ల‌లో ఉన్నారు. ఇటు వైకాపా నేత మోకా భాస్క‌ర‌రావు హ‌త్య కేసులో టీడీపీకి పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత కొల్లు భాస్క‌ర‌రావు కూడా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో ఉన్నారు. ఇంకా మాజీ మంత్రి పితాని స‌త్య‌నార‌ణ వ‌ద్ద ప‌నిచేసినన ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారి ముర‌ళీ మోహ‌న్ కూడా అరెస్ట్ అయ్యారు. పితాని కుమారుడు వెంక‌ట సురేష్ కూడా ఏ క్ష‌ణ‌మైనా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. టీడీపీ పార్టీ సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడిపై నిర్భ‌య స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోద‌య్యాయి.

అదే పార్టీకి చెందిన దేవినేని ఉమ స‌హా ప‌లువురి టీడీపీ నేత‌ల‌పై కూడా భారీగానే కేసులు న‌మోదైన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంట‌ర్వూలో దేవినేని ఈ అరెస్ట్ ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. చ‌ట్ట బ‌ద్దంగా జ‌గ‌న్ స‌ర్కార్ వెళ్తుంద‌ని..అందుకే ఇన్ని అరెస్ట్ లు జ‌రిగాయ‌ని ఇంట‌ర్వ్యూయ‌ర్ అంటే? వాటిని దేవినేని కొట్టిపారేసారు. అన్ని అక్ర‌మంగా బ‌నాయించిన కేసుల‌ని వాదించారు. త‌న‌పైనా నాన్ బెయిల్ సెక్ష‌న్ల కింద కేసులు ఎన్నో పెట్టార‌ని…జ‌గ‌న్ 14 నెల‌ల పాల‌న‌లో అవినీతిని ఎండ‌గ‌డితే ఇచ్చిన బ‌హుమానం అంటూ మండిప‌డ్డారు. అరెస్ట్ లంటే? భ‌య‌మా? అని ప్ర‌శ్నించ‌గా రాజ‌కీయ జీవితంలో ఎన్నో అరెస్ట్ ల‌ను చూసాన‌న్నారు.

అన్యాయాన్ని ప్రశ్నించే క్ర‌మంలో ఎంత దూర‌మైనా వెళ్తాన‌ని దేనికి భ‌య‌ప‌డేది లేద‌ని పేర్కొన్నారు. అరెస్ట్ ల వెనుక జ‌గ‌న్ కి ఏదైనా వ్యూహం ఉందంటారా? అంటే ఏపీలో జ‌గ‌న్ పాల‌న మాత్ర‌మే కొన్ని ద‌శాబ్ధాల పాటు కొన‌సాగించాల‌ని చూస్తున్న‌ట్లు ఆరోపించారు. వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి టీడీపీ పార్టీలో కీల‌క నేత‌లంద‌ర్నీ అరెస్ట్ చేసి జైళ్ల‌లో పెట్టి సునాయాసంగా గెవ‌లాల‌ని చూస్తున్న‌ట్లు అరోపించారు. టీడీపీ పార్టీనే ఏపీలో లేకుండా చేయాల‌ని పునాదుల‌తో స‌హా నాశ‌నం చేయాల‌ని పెద్ద వ్యూహ‌మే ప‌న్నుతున్నార‌ని ఆరోపించారు ఉమ‌.