పెరుగుతో లాభాలెన్నో..! శరీరానికి అందే పోషకాలెన్నో..!!

ఎంత కమ్మటి భోజనం చేసినా చివరన పెరుగు అన్నం తినకపోతే ఆ భోజనానికి పరిపూర్ణత ఉండదు. పెరుగన్నంకు అంత ప్రాముఖ్యత ఉంది. శరీరానికి చలవ చేయాలన్నా.. భోజనం తర్వాత కమ్మటి నిద్ర పట్టాలన్నా పెరుగు అన్నం తినాల్సిందే. వ్యాధినిరోధక శక్తికి పెరుగు దివ్య ఔషధం అని చెప్పాలి. తాజా పెరుగు తినడంతో మంచి బ్యాక్టీరియా శరీరానికి అందుతుంది. నిల్వ ఉన్న పెరుగు శరీరానికి అంత మంచిది కాదు. అందుకే తాజా పెరుగే శ్రేయస్కరం. పుల్లటి పెరుగు కూడా అంత శ్రేయస్కరం కాదు. తాజా పెరుగు జీర్ణశక్తికి కూడా ఉపయోగపడుతుంది. మంచి ప్రొటీన్స్ అందిస్తుంది.

శరీరానికి అవసరమయ్యే పోషకాలెన్నో పెరుగులో ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం వల్ల రక్తప్రసరన సక్రమంగా జరుగుతుంది. పెరుగు వల్ల దక్కే విటమిన్లలో డి-విటమిన్ ప్రధానం. దీంతో శరీరానికి అదనపు బలం చేకూరుతుంది. పెరుగు ఎక్కువ తీసుకోవడం వల్ల ఇతర ఆహార పదార్ధాలపై కంటే ఎక్కువ ఇష్టం కలిగిస్తుంది. పెరుగు తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. పెరుగు ఇచ్చే శక్తి అటువంటిది. పొట్ట తగ్గేందు అవకాశం ఉంటుంది. ఊబకాయం ఉన్నవాళ్లు పెరుగు తప్పనిసరిగా తీసుకుంటే కార్టిసోల్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

సాధారణంగా గేదె పాలతో వచ్చే పెరుగునే ఎక్కువగా తింటాం. కానీ.. ఆవు పాలతో వచ్చే పెరుగు మరింత మంచి చేస్తుంది. ఫ్యాట్ కంట్రోల్ చేస్తుంది. ప్రొటీన్లు ఎక్కవగా ఉంటాయి. అయితే.. ఎక్కువగా గేదే పాలే లభ్యమవడం వల్ల ఆ పెరుగునే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. పురుషులలో వీర్యోత్పత్తికి కూడా పెరుగు ఎంతో ఉపయోగపడుతుందని అంటారు. పెరుగన్నంలో ఉల్లిపాయ, మిర్చి కూడా నంజుకు తింటారు. ఇది ఎంతో బలాన్నిస్తుందని చెప్తారు. ఎలా చూసినా పెరుగు వల్ల లాభాలు చాలా ఎక్కువ. కాబట్టి.. కమ్మటి పెరుగు అన్నంలో తిన్నప్పుడు వచ్చే మజాను మిస్సవ్వకూడదు..!