ప్రగతి నివేదన సభలో ఎంపీ బూర నర్సయ్యకు అవమానం పై గౌడ సంఘాల ఆగ్రహం

ప్రగతి నివేదన సభలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కు అవమానం జరిగిందని,  స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కావాలనే ఇలా ప్రవర్తించారని గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరవింద్ గౌడ్ పూదారి, బూర నర్సయ్య గౌడ్ యువసేన సభ్యుడు ఉయ్యాల ప్రశాంత్ గౌడ్ ఖండించారు. సభ ముగిసిన తర్వాత వందన సమర్పణ చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్థానిక ఎంపీ  పేరు పలకకుండా అవమానించారన్నారు.

బూర నర్సయ్యగౌడ్ పేరును ప్రస్తావించకుండా పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పేరు కూడా పలికారన్నారు. గౌడజాతికి చెందిన బూర నర్సయ్యగౌడ్ ను అవమానించిన ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

                        

             అరవింద గౌడ్ పూదారి, గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రగతి నివేదన సభ సాక్షిగా వ్యవహారించిన తీరు బాధాకరం. కనీసం ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీ పేరు పలకలేదు. ఎంపీ మీద ఉన్న కక్ష్యతోనే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఈ విధంగా గౌడ జాతి బిడ్డ బూర నర్సయ్యను అవమానించారు.

          

ఉయ్యాల ప్రశాంత్ గౌడ్, బూర నర్సయ్య యువసేన సభ్యుడు

 ఎంపీ బూర నర్సయ్యగౌడ్ గారి పేరును పలకకుండా ప్రగతి సభ సాక్షిగా అవమానించారు. దీనిని ఖండిస్తున్నాం. తక్షణమే ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, మళ్లోసారి ఇటువంటి తప్పులు జరగకుండా చూడాలి.