సహనం కోల్పోతున్న పవన్ కళ్యాణ్.! కానీ, ఎందుకు.?

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ సహనం కోల్పోతున్నారు. నిజానికి, ఆయనకి సహనం ఎప్పుడుంది గనుక.! ఔనేమో.. అలాగే అనుకోవాలేమో.! కానీ, గతంలో పరిస్థితి వేరు. ఇప్పుడాయన పరిస్థితి వేరు. లక్షలు ఖర్చు చేస్తున్నారు.. కోట్లు గుమ్మరిస్తున్నారు.. కానీ, కోరుకున్న పొలిటికల్ మైలేజీ వచ్చిందా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదు.

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. అని పదే పదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. కానీ, ఎలా.? అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కతాటిపైకి వచ్చి, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు.. అదే మాట చెబితే అది వేరే లెక్క. పదే పదే పవన్ ఒక్కరే ఆ మాటని గొంతు చించుకుని మరీ చెబితే ఉపయోగమేంటి.?

రాను రాను పవన్ కళ్యాణ్ పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా తయారవుతోంది ఏపీ రాజకీయాల్లో. కాపు ఓటు బ్యాంకు జనసేన వైపు వస్తుందో లేదో తెలియదు. గడచిన ఎనిమిదన్నరేళ్ళుగా చేస్తున్న రాజకీయం తాలూకు ప్రభావమేంటో అర్థం కావడంలేదు. ఇదీ జనసేన పరిస్థితి.

టీడీపీ సైతం, ‘వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు’ విషయంలో జనసేనతో గొంతు పలకడంలేదు. మిత్రపక్షం బీజేపీ కూడా జనసేనతో ఏకీభవించని పరిస్థితి. ‘నేనే ముఖ్యమంత్రినవుతా..’ అని చెబుతూనే, ‘ఆ స్థాయి వుందో లేదో తెలియని అయోమయం’ ప్రదర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్.

ఈ నేపథ్యంలోనే జనసేనాని సహనం కోల్పోతున్నారు. అదే అధికార పార్టీకి కావాల్సింది కూడా. నిజానికి, జనసేన వల్ల నేరుగా వైసీపీకి వచ్చే నష్టం పెద్దగా వుండకపోవచ్చు. కానీ, వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా పవన్ చేయగలిగితే, వైసీపీకి ఇబ్బంది కలుగుతుంది. దానికి ఎటూ పవన్ కళ్యాణ్‌కి ఇతర పార్టీల నుంచి మద్దతు రావడంలేదు గనుక, వైసీపీ హ్యాపీయేనన్నమాట.. అదే పవన్ కళ్యాణ్‌లో అసహనాన్ని పెంచుతోంది.