మేయర్ పీఠం కోసం స్కెచ్ వేసిన చిన్న శీను..?

రాజకీయాల్లో రూటు మార్చడం పెద్ద వింతేమీ కాదు కానీ, ఈ విజయనగరం నేత చిన్న శ్రీను వేసిన స్కెచ్ మాత్రం బెజవాడ నుంచి వైజాగ్ దాకా అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. నిన్నటి దాకా భీమిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా జగన్ భజన చేసిన ఈ కాపు నేత, ఇప్పుడు టక్కున ప్లేట్ ఫిరాయించి పచ్చ కండువా కప్పేసుకున్నాడు. అయితే ఈ పార్టీ మార్పు వెనుక ఉన్న అసలు గుట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ సిద్ధాంతాలు నచ్చి వెళ్లాడో లేదో కానీ, తన కుమార్తె సిరి సహస్ర కు గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం దక్కించుకోవడమే పరమావధిగా ఈయన గారు… సారీ.. చిన్న శ్రీను ఈ సరికొత్త పొలిటికల్ గేమ్ ఆడినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో నవ్వుకుంటున్నారు.

విశాఖ నగరంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం, ప్రస్తుతం టీడీపీలో సరైన మేయర్ అభ్యర్థి లేకపోవడాన్ని చిన్న శ్రీను కరెక్ట్‌గా క్యాష్ చేసుకున్నాడు. “నేను పార్టీలోకి వస్తా.. నాకున్న కాపు నేతల పట్టుతో వైజాగ్ ని గెలిపించి ఇస్తా.. కానీ నా కూతురికే మేయర్ టికెట్ ఇవ్వాలి” అంటూ ముందే పక్కా డీల్ కుదుర్చుకుని మరీ సైకిల్ ఎక్కినట్లు టాక్ నడుస్తోంది. అటు వైసీపీలో ఉంటే వచ్చే ఎన్నికల్లో కార్పొరేషన్ గెలవడం కష్టమని ముందే పసిగట్టి, ఇటు పవర్ లో ఉన్న కూటమిలోకి దూకి తన కుమార్తె భవిష్యత్తుకు భారీ లైన్ క్లియర్ చేసుకున్నాడు. ఏదేమైనా కూతురి కోసం వేసిన ఈ మేయర్ స్కెచ్ చూసి తోటి రాజకీయ నాయకులే “భలే ప్లాన్ చేసావ్ భయ్యా” అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

తన సొంత జిల్లా విజయనగరంలో కాకుండా, విశాఖపట్నం పీఠంపై కన్నేసి చిన్న శ్రీను చేసిన ఈ క్రేజీ పొలిటికల్ మూవ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే టీడీపీలో ఉన్న పాత సీనియర్ నేతలు, అలాగే కూటమి భాగస్వామి జనసేన ఈ మేయర్ సీటును అంత ఈజీగా ఈ కొత్తగా వచ్చిన నేత చేతిలో పెడతాయా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకవేళ చివరి నిమిషంలో సీన్ రివర్స్ అయితే చిన్న శ్రీను పరిస్థితి “రెండు పడవల ప్రయాణం” లాగా మారుతుందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.