ప్రపంచంలోనే అత్యధిక జీతం తీసుకునే ప్రధాని ఎవరో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకుల జీతాల పెంపు అనగానే ప్రజాధనం వృథా అనే విమర్శలు వస్తుంటాయి. కానీ ఆసియాలోని అత్యంత సంపన్న దేశమైన సింగపూర్ మాత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. తన దేశ రాజకీయ నాయకుల, మంత్రుల వేతనాల్లో ఏకంగా 60 శాతానికి పైగా భారీ పెంపును అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వంలోకి అత్యంత సమర్థులైన మేధావులను, ప్రతిభావంతులైన నాయకులను ఆకర్షించేందుకు, అవినీతికి తావులేని అత్యుత్తమ పాలన అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ వెల్లడించారు.

ఒక స్వతంత్ర కమిటీ సిఫార్సుల మేరకు దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మంత్రుల వేతనాలను ఆ దేశం భారీగా సవరించడం విశేషం. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో సింగపూర్ ప్రధాని, మంత్రుల కొత్త వార్షిక వేతనాలు మన భారతీయ కరెన్సీ లెక్కింపులో మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌కు చేరాయి. సింగపూర్ ప్రధాని వార్షిక జీతం సుమారు ₹16.5 కోట్ల నుంచి ఏకంగా ₹27.07 కోట్లకు పెరిగింది. అంటే ఒక్కసారే దాదాపు ₹10.5 కోట్ల వార్షిక పెంపు లభించింది. ఈ పెంపుతో ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకునే ఏకైక దేశాధినేతగా లారెన్స్ వాంగ్ చరిత్ర సృష్టించారు.

అయితే ఇక్కడే ఆయన తన గొప్ప మనసును చాటుకున్నారు. తనకు పెరిగిన ఈ అదనపు జీతం మొత్తం మొత్తాన్ని తన పదవీకాలంలో ప్రజా సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేస్తానని ప్రధాని వాంగ్ సంచలన ప్రకటన చేశారు. మరోవైపు ఉప ప్రధాన మంత్రి వార్షిక వేతనం దాదాపు ₹14.06 కోట్ల నుంచి ఏకంగా ₹23.01 కోట్లకు చేరింది. క్యాబినెట్ మంత్రుల సీనియారిటీ, వారి శాఖల ప్రాధాన్యత ఆధారంగా వార్షిక జీతం సుమారు ₹13.53 కోట్ల నుంచి రూ. 21.66 కోట్ల వరకు ఉండనుంది.

సింగపూర్ ప్రభుత్వం తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం ప్రకారం, ప్రస్తుత పదవుల్లో ఉన్న నాయకులకు అక్టోబర్ 15 నుండి వారి పనితీరు ఆధారంగా అదనంగా 9 శాతం వరకు వన్‌-ఆఫ్ అడ్జస్ట్‌మెంట్ బోనస్ కూడా అమలు కానుంది. కార్పొరేట్ కంపెనీల సీఈఓల తరహాలోనే రాజకీయ నాయకులకు కూడా భారీ వేతనాలు ఇస్తేనే.. వారు పూర్తి నిబద్ధతతో, ఎలాంటి అవినీతి ఆశలు లేకుండా దేశాభివృద్ధి కోసం పనిచేస్తారనే సింగపూర్ ప్రభుత్వ సిద్ధాంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీస్తోంది.