11 సీట్ల నుంచి ‘పాదయాత్ర 2.O’ వరకు.. జగన్ కొత్త రూట్ మ్యాప్..!

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తటి కోలుకోలేని దెబ్బ తీశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 151 స్థానాల అఖండ మెజారిటీతో ఐదేళ్ల పాటు ఏకఛత్రాధిపత్యం చలాయించిన వైసీపీ.. కేవలం 11 సీట్లకు పరిమితమై, కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక డిఫెన్స్‌లో పడిపోయింది. నాటి ఎన్నికల ఘోర పరాజయం తర్వాత గత రెండేళ్లుగా పార్టీ పరిస్థితి క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళంగా మారింది. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, చివరకు విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను లాంటి జిల్లా అధ్యక్షులు కూడా వరుసగా కండువాలు మార్చేస్తూ జంపింగ్ జిలానీలుగా మారుతుండటంతో క్యాడర్‌లో తీవ్ర నైరాశ్యం అలుముకుంది.

తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమయ్యారనే విమర్శల మధ్య.. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన అమ్ములపొదిలోని బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు. ఈ నేపథ్యంలోనే, బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ నేతల తాజా సమావేశంలో జగన్ ప్రకటించిన ‘పాదయాత్ర 2.O’ వ్యూహం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ప్రారంభం కానున్న ఈ సుదీర్ఘ పాదయాత్ర.. తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న వైఎస్సార్‌సీపీకి ఒక సంజీవనిలా పనిచేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో 2017లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ ఎలాగైతే ఒంటరిగా ఉన్న ఆయనను ముఖ్యమంత్రి కుర్చీ వైపు నడిపించిందో.. ఇప్పుడు కూడా అదే ‘సెంటిమెంట్ ఫార్ములా’ను నమ్ముకుని జనం మధ్యలోకి వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. నిరంతరాయంగా 18 నెలల పాటు ప్రజల్లోనే గడపడం ద్వారా, కూటమి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను మరియు నెరవేర్చని సూపర్ సిక్స్ హామీలను నేరుగా ప్రజల్లోనే ఎండగట్టవచ్చనేది ఆయన ప్లాన్. ఈ పాదయాత్ర వల్ల క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీకి ప్రధానంగా మూడు రకాలుగా మేలు జరిగే అవకాశం ఉంది.

మొదటిది.. నిరాశతో జెండాలు మడతపెట్టేస్తున్న గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల్లో ఈ యాత్ర సరికొత్త జోష్ నింపుతుంది. రెండోది.. పార్టీని వదిలి వెళ్లాలనుకునే సీనియర్ నేతలకు “నేను మళ్లీ రోడ్డుపైకి వస్తున్నాను.. 2029లో మనదే అధికారం” అనే గట్టి నమ్మకాన్ని కలిగించి వలసలకు అడ్డుకట్ట వేయవచ్చు. మూడోది.. కూటమి ప్రభుత్వానికి ఇంకా కేవలం రెండు బడ్జెట్లు, మూడేళ్ల కాలమే మిగిలి ఉన్నందున, కరెక్ట్‌గా లోకల్ బాడీ ఎన్నికలు మరియు సార్వత్రిక ఎన్నికల ముందరి కీలక సమయంలో ఈ యాత్ర సాగడం వల్ల యాంటీ-ఇంకంబెన్సీ ఓట్లను పూర్తిగా తమ ఖాతాలోకి మళ్లించుకునే ఛాన్స్ దక్కుతుంది. మొత్తానికి, 2024 నాటి 11 సీట్ల అవమానాన్ని తుడుచేసి, వైసీపీని 2.O వెర్షన్‌గా మార్చడానికి జగన్ సిద్ధం చేసిన ఈ సరికొత్త పాదయాత్ర వ్యూహం.. ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి.