బ్రేకింగ్: కెటిఆర్, హరీష్ పై లైంగిక వేధింపుల కోసం..?

తెలంగాణ అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న పొలిటికల్ హైడ్రామా చివరకు పోలీసు కేసుల వరకు వెళ్ళింది. అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై మాజీ మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్‌రావు సహా పలువురు కీలక బీఆర్‌ఎస్ నేతలపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఈ కేసుకు సంబంధించిన వివరాల ప్రకారం.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే రాజకీయ నినాదాలు ఉన్న దుస్తులు, ప్లకార్డులతో లోపలికి వెళ్లడానికి అనుమతి లేదని గేట్ వద్ద భద్రతా సిబ్బంది వారిని నిలువరించారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం మరియు తోపులాట చోటుచేసుకుంది. మహిళా పోలీసులను రక్షణ కవచంగా వాడుకుంటూ ప్రభుత్వం చౌకబారు రాజకీయాలు చేస్తోందంటూ కొందరు నేతలు గట్టిగా అరుస్తూ మహిళా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఈ ఫిర్యాదు ఆధారంగా సైఫాబాద్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత లోని మహిళల పట్ల నేరపూరిత బలాన్ని ప్రయోగించడం, విధులకు ఆటంకం, అవమానించడం, బెదిరింపులు వంటి పలు కఠినమైన సెక్షన్ల (Sections 74, 75(1), 79, 121(1), 132, 296) కింద ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. కేటీఆర్, హరీశ్‌రావులతో పాటు ఎమ్మెల్యేలు డి. సుధీర్ రెడ్డి, కేపీ వివేకానంద్, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మరియు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తదితరుల పేర్లను ఈ కేసులో చేర్చినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.