రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్ ఎలాగూ సైకిల్ ఖాతాలోనే పడుతుందనే ధీమాతో ఉన్న బెజవాడ తమ్ముళ్లు.. కాబోయే మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఇప్పటి నుంచే రూట్ మ్యాప్లు సిద్ధం చేసుకుంటున్నారు. అమరావతి రాజధానికి కూతవేటు దూరంలో ఉంటూ, ఏపీకి గుండెకాయ లాంటి విజయవాడ కార్పొరేషన్కు ‘మేయర్’ ఎవరు అనేది ఇంకా తేలక ముందే లాబీయింగ్ పీక్స్కి చేరింది. ఈ క్రమంలోనే బెజవాడ పాలిటిక్స్లో దశాబ్దాల చరిత్ర కలిగిన దేవినేని కుటుంబం కూడా లైన్లోకి వచ్చేసింది. తాజాగా దేవినేని చందు తన భార్య మహిత, తల్లి అపర్ణ దేవితో కలిసి ఐటీ మంత్రి నారా లోకేష్ను అమరావతిలో పర్సనల్గా కలిసి తమ మనసులోని ముచ్చటను బయటపెట్టేశారు.
మంత్రి లోకేష్తో భేటీ అయిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. “ఒక మర్యాదపూర్వక కలయిక… ఒక కొత్త ఆశ” అంటూ దేవినేని చందు పెట్టిన పోస్ట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఈ “కొత్త ఆశ” వెనుక ఉన్న అసలు అర్థం ఏంటంటే.. విజయవాడ మేయర్ సీటు రేసులో తమ పేరును, ముఖ్యంగా దేవినేని మహిత పేరును కూడా పరిశీలించాలనే బిగ్ ప్లాన్. దేవినేని నెహ్రూ కాలం నాటి పాత కేడర్, పాత ఇమేజ్ను వాడుకుని బెజవాడ పీఠాన్ని కైవసం చేసుకోవాలని వారు చూస్తున్నారు. నోటిఫికేషన్ ఊసే లేకుండా దేవినేని ఫ్యామిలీ ఇలా ముందస్తు అడుగులు వేయడంతో, ఇప్పటికే మేయర్ సీటుపై కర్చీఫ్లు వేసుకుని తిరుగుతున్న మిగిలిన సీనియర్ తమ్ముళ్లకు ఒక్కసారిగా షాక్ తగిలింది.
అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం ఈ విషయంలో ఎవరికీ ముందస్తు కన్ఫర్మేషన్ ఇవ్వకుండా భలే సస్పెన్స్ మెయింటెన్ చేస్తోంది. బెజవాడ కార్పొరేషన్ పీఠంపై ఇప్పటికే పలువురు సీనియర్ లీడర్ల వారసులు క్యూ కట్టి ఉండటంతో, చంద్రబాబు మరియు లోకేష్ సామాజిక సమీకరణాల లెక్కలు వేస్తూ సైలెంట్గా ఉన్నారు. కేవలం ఎన్నికల సమయంలో పార్టీ కోసం నమ్మకంగా ఉండి, క్షేత్రస్థాయిలో కష్టపడిన ఒరిజినల్ కేడర్కే ప్రాధాన్యత ఉంటుందని అధిష్టాన వర్గాల సమాచారం. “టికెట్ ఎవరికి దక్కినా మీ ఈగోలు పక్కనబెట్టి కలిసి పనిచేయండి” అంటూ ముందే లెక్చర్లు ఇస్తున్న అధిష్టానం, చివరి నిమిషంలో ఎవరికి సీటు ఇస్తుందో, ఎవరి ఆశను నెరవేరుస్తుందో చూడాలి మరి.