కేటీఆర్ పై ఆర్కే కు భయంతో కూడిన భక్తివల్ల పెరిగిన గౌరవం 

KTR
ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ యధాతధంగా ఈ వారం కూడా తన “కొత్త పలుకు”లో ముఖ్యమంత్రి జగన్ పై విషం చిమ్మారు. ఈ వారాంతపు విష ప్రయోగం మొదటినుండి చూస్తున్నదే అయినా ఈ వారంలో కొంత మార్పు కనిపించింది. 
 
మొదటి మార్పు తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు. ప్రత్యేకించి కేటీఆర్ పనితీరుపై ప్రశంసలు. కరోనా నేపథ్యంలో చైనా నుండి బయట పడాలని చూస్తున్న కంపెనీలను హైదరాబాద్ కు ఆకర్షించేందుకు కేటీర్ చొరవ చూపిస్తున్నారని, కేటీఆర్ ముందుచూపు ఉన్న నాయకుడిగా పనిచేస్తున్నారని రాధాకృష్ణ కితాబు ఇచ్చారు. జగన్ ను విమర్శించాలంటే, జగన్ పనితీరు బాగోలేదు అని చెప్పాలంటే కే కేటీఆర్ ను పొగడాలి అనుకున్నాడేమో రాధాకృష్ణ. ఆమేరకు ఆ కార్యం ముగించారు. పైగా ఈ పనితో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల రాధాకృష్ణపై వ్యక్తం చేసిన ఆగ్రహం కొంత తగ్గించేందుకు ఈ వారం కొత్తపలుకును వేదికగా వాడేసుకున్నారు. 
 
ఎలాగో తెలంగాణ ప్రభుత్వాన్ని పొగిడి ప్రసన్నం చేసుకోకపోతే హైదరాబాద్ లో లేక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తన ఆస్తులకు రక్షణ ఉండదని రాధాకృష్ణకు తత్త్వం బోధపడింది. అందుకే నేరుగా కెసిఆర్ ను కాకుండా కేటీఆర్ సమర్ధతను పొగిడేస్తే పుణ్యం, పురుషార్థం లభిస్తుందని రాధాకృష్ణ కొత్త ఎత్తుగడ. ఇందులో జగన్మోహన్ రెడ్డిపై దాడికి కూడా  కేటీఆర్ పై ప్రశంసలను వాడుకున్నారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం అన్నా, కెసిఆర్ మరియు  కేటీఆర్ అన్నా రాధాకృష్ణ వెన్నులో వణుకు పుడుతోంది. అది ఈ ఆదివారం కొత్తపలుకులో నిరూపించుకున్నారు.
 
ఇక ఈ వారం కనిపించిన మరో అంశం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేసిన విమర్శలకు నేరుగా జవాబివ్వకపోవడం. ఆ మాటకొస్తే రాధాకృష్ణ ఎప్పుడూ, ఎవరికీ నేరుగా జవాబివ్వడు. దొడ్డిదారి వ్యవహారమే. ఆయన పెరుగుదలే దొడ్డిదారి. ఆయన ఆంధ్రజ్యోతి యజమాని అయ్యిందే దొడ్డిదారిన. ఆయన సంపాదన మొత్తం దొడ్డిదారిన. అందువల్ల ఆయన సమాధానాలు దొడ్డిదారినే ఉంటాయి. 
 
యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ఒకటే ప్రశ్న సంధించారు. “మీ పిల్లలు, మనవళ్లతో సహా ఏ మీడియం లో చదువుతున్నారు”? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు రాధాకృష్ణ దొడ్డిదారి జవాబులిచ్చారు. తన పిల్లలకు తెలుగు నేర్పుతున్నాను అన్నారు. తన మనవళ్లకు కూడా తెలుగు నేర్పిస్తున్నాను అని చెప్పడం యార్లగడ్డ అడిగిన ప్రశ్నకు జవాబు కాదు. రాధాకృష్ణ పిల్లలు, వారి పిల్లలు అందరూ చదివేది ఇంగ్లీష్ మీడియం. ఇంట్లో తెలుగు మాట్లాడవచ్చు. తెలుగు నేర్పించవచ్చు. కానీ చదివేది ఇంగ్లీష్ మీడియం. ఈ విషయం రాధాకృష్ణ  నేరుగా  ఎందుకు చెప్పరు? 
 
ప్రభుత్వం చెప్పేది కూడా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, తెలుగు ఒక పాఠ్యంశంగా నిర్బంధం చేయాలి. ఇంట్లో మాతృబాష మాట్లాడుకోవచ్చు అనేది ప్రభుత్వ నిర్ణయం. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన రాధాకృష్ణ తన పిల్లలు ఏ మీడియం చదువుతున్నారో చెప్పకుండా తప్పించుకున్నారు. ఒకవేళ నేరుగా జవాబు చెపితే జగన్ ప్రభుత్వం చేస్తున్న పని కూడా ఇదేగా? మరి వ్యతిరేకించడం ఎందుకు అనే ప్రశ్న వస్తుందని రాధాకృష్ణ భయం. 
 
రాధాకృష్ణ ఇప్పుడు తన పిల్లలకు ఇంట్లో నేర్పిస్తున్న తెలుగు (మాతృ బాషా) ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం నిర్బంధం చేసిందని తెలుసుకోవాలి. రాధాకృష్ణ ఇంట్లో తెలుగు నేర్పించాల్సిన అవసరం లేదు. అన్ని ప్రభుత్వ మరియు ప్రవేటు పాఠశాలల్లో తెలుగు (మాతృబాష) ఒక పాఠ్యంశంగా నిర్బంధం చేయడం వల్ల తమ వారసులకు మాతృభాషను ఇంట్లో బోధించే అవసరం ఉండదు. అయినా రాధాకృష్ణ తన యజమాని రాజకీయాలకోసం అలాగే రాస్తుంటారు. కొత్తగా కనిపించింది మాత్రం తెలంగాణ ప్రభుత్వం పట్ల భయంతో కూడిన భక్తివల్ల పెరిగిన గౌరవం.