బ్రేకింగ్ న్యూస్ : వికారాబాద్ లో రైల్వే టిసి అమానుషం, నిండు ప్రాణం బలి

టికెట్ లేని ప్రయాణం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. టిసిని గమనించిన ఓ యువకుడు రైలు నుంచి కిందకు దూకే ప్రయత్నం చేయగా టిసి అతని కాలర్ పట్టుకున్నాడు. దీంతో అదుపుతపప్పిన యువకుడు రైలు పట్టాలపై పడిపోయాడు. అతనిపై నుంచి రైలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దారుణ ఘటన శనివారం ఉదయం వికారాబాద్ లో జరిగింది.

వికారాబాద్ జిల్లాలోని తాండూరు నుంచి నాంపల్లి వరకూ రోజూ ప్యాసింజర్ రైలు నడుస్తోంది. వికారాబాద్ పరిధిలోని అనంతగిరిపల్లి తండాకు చెందిన కాట్రావత్ శివ టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కాడు. తనిఖీలకు వచ్చిన టీసీని గమనించిన యువకుడు రైలు దిగేందుకు యత్నించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన టీసీ అతని అంగి గల్లాను పట్టుకున్నాడు. ఇంతలో రైలు కదలడంతో అదుపుతప్పిన ఆ యువకుడు రైలు పట్టాల మధ్యలో పడిపోయాడు. వెంటనే అతని పై నుంచి రైలు వెళ్లిపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు.

ఈ ఘటనతో ఆగ్రహించిన ప్రయాణికులు టీసీని చితకబాదారు. ఇతనికి మద్దతుగా అక్కడికి వచ్చిన మరో ముగ్గురు టీసీలను కూడా కొట్టారు. కాగా, చనిపోయిన యువకుడు తాండూరుకు చెందినవాడేనని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.