ఆంధ్రాలో దారుణం : నడి రోడ్డు పై భార్యను నరికి చంపిన భర్త  (వీడియో)

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పట్టపగలే నడి రోడ్డు పై భార్యను భర్త అతి కిరాతకంగా నరికి చంపాడు. అనుమానం పెను భూతమై దారుణానికి ఒడి గట్టాడు.  పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన అసలు వివరాలు ఏంటంటే…

పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడకు చెందిన సత్యవతి, లెనిన్ భార్య భర్తలు. సత్యవతి పులిరామన్నగూడెంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పని చేస్తోంది. తన విదుల్లో భాగంగా సత్యవతి అందరితో మాట్లాడేదని, అందరితో కలుపుగోలుగా ఉండేదని తోటి సిబ్బంది అన్నారు. అయితే సత్యవతి అందరితో మాట్లాడుతుండడంతో లెనిన్ సత్యవతి పై అనుమానం పెంచుకున్నాడు. గత కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య ఈ విషయమై గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

సత్యవతి పై అనుమానం పెంచుకున్న లెనిన్ ఎలాగైనా సత్యవతిని అంతమొందించాలనుకున్నాడు.  గురువారం డ్యూటికి వెళ్లిన సత్యవతి తిరిగి ఇంటికి వస్తోంది. బుట్టాయి గూడెం బస్టాండ్ లో బస్సు దిగింది. అప్పటికే అక్కడ సత్యవతిని చంపేందుకు లెనిన్ కాపు కాసి కూర్చున్నాడు. సత్యవతి బస్టాండ్ లో దిగగానే కత్తితో లెనిన్ ఆమె పై కత్తితో దాడి చేశాడు. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే కత్తితో ఆమె తల పై నరికాడు. కత్తిపోట్లకు సత్యవతి అక్కడే కుప్పకూలింది. క్షణాల్లోనే ప్రాణాలు విడిచింది.

నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే దారుణం జరగడంతో అంతా భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని నిందితుడు లెనిన్ ను అదుపులోకి తీసుకున్నారు. లెనిన్ ఓ మీడియా సంస్థలో జర్నలిస్ట్ గా పని చేస్తున్నాడని తెలుస్తోంది. దారుణం జరిగిన వీడియో కింద ఉంది చూడండి.