Raghu Rama Krishna Raju: రాష్ట్రంలో మత మార్పిడిల అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుగా వినియోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన, బలవంతపు లేదా మోసపూరిత మత మార్పిడిలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
మత మార్పిడి విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను రఘురామకృష్ణంరాజు ఈ సందర్భంగా ఉటంకించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మతాన్ని అనుసరించే స్వేచ్ఛను ఇచ్చిందని, అయితే మతతత్వాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మత మార్పిడిలకు పాల్పడితే 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
దళిత సోదరులను మోసం చేయకండి హిందూ దళిత సోదరులను మత మార్పిడిల పేరుతో తప్పుదోవ పట్టించవద్దని ఆయన కోరారు. “క్రిస్టియన్లుగా మారిన వారికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే హక్కు ఉండదు. దయచేసి అమాయక ప్రజలను మోసం చేయకండి” అని హితవు పలికారు.
ఆకివీడులో అద్భుత రామాలయ నిర్మాణం:- గత నెలలో తన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించిన ఆలయ నిర్మాణ అంశాన్ని కూడా ఆయన మరోసారి ప్రస్తావించారు. ఆకివీడు పెదపేటలోని పురాతన రామాలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించనున్నట్లు తెలిపారు.
ప్రముఖ స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో శిల్పకళ, వాస్తు, ఆగమ శాస్త్రాల ప్రకారం ఈ నిర్మాణం జరగనుంది. పూర్తిగా కృష్ణ శిలతో నిర్మించనున్న ఈ ఆలయం, కనీసం 8 శతాబ్దాల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రఘురామ వివరించారు.
మతపరమైన విలువలను కాపాడుకుంటూనే, చట్టవిరుద్ధమైన మత మార్పిడిలను అడ్డుకోవాలని ఆయన అధికారులను మరియు ప్రజలను కోరారు.

