Jada Shravan Kumar: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణం మరియు చర్చిలకు నోటీసుల వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీరుపై జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రఘురామను టీడీపీని ముంచడానికి వచ్చిన “శకుని”గా ఆయన అభివర్ణించారు.
ఆకివీడు మండలంలో అనుమతులు లేని 113 చర్చిలకు నోటీసులు ఇస్తామన్న రఘురామ ప్రకటనపై జడ శ్రవణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “చర్చిలకు నోటీసులు ఇచ్చే అధికారం ఎమ్మెల్యేకు ఎక్కడిది? అది మున్సిపల్ అధికారుల పని. ఎమ్మెల్యేగా తన పరిధులు తెలుసుకుని ప్రవర్తించాలి” అని హితవు పలికారు. కేవలం ఒక సామాజిక వర్గం ఓట్లతోనే కూటమి గెలిచిందా అని ప్రశ్నిస్తూ, దళితులు, క్రైస్తవుల ఓట్లు లేనిదే రఘురామ గెలిచారా అని నిలదీశారు.
రాష్ట్రంలో అనుమతులు లేని హిందూ దేవాలయాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయని, గత రెండేళ్లుగా తాను ఆ వివరాలు సేకరించానని శ్రవణ్ కుమార్ వెల్లడించారు. “నేనెప్పుడైనా ఆ ఆలయాలపై కేసులు వేశానా? అనుమతుల వ్యవహారం అధికారులు చూసుకుంటారు. కానీ రఘురామ వ్యక్తిగత అజెండాతో ఒక మతంపై దాడి చేయడం సరికాదు” అని మండిపడ్డారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

ఆకివీడు పెదపేటలో రామాలయాన్ని పునర్నిర్మిస్తామని రఘురామకృష్ణరాజు ప్రకటించగా, స్థానిక మరో వర్గం ‘గొంతెనమ్మ’ ఆలయాన్ని నిర్మించాలని కోరుతోంది. ఈ క్రమంలోనే నివాసాల మధ్య ఉన్న చర్చిలకు అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది.
పెదపేటలో ఆలయ పునర్నిర్మాణానికి రఘురామ పిలుపు. అనుమతులు లేని 113 చర్చిలపై చర్యలకు రంగం సిద్ధం. టీడీపీ పునాదులను కదిలించేందుకే రఘురామ ఇలా చేస్తున్నారని జడ శ్రవణ్ ఆరోపణ.
ప్రస్తుతం ఆకివీడులో నెలకొన్న ఈ మతపరమైన, రాజకీయ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

