Harsha Kumar: పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ పరిధిలోని చర్చిలకు అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం ప్రతీకార కోణంతో వ్యవహరించడం సరికాదని ఆయన హితవు పలికారు. ముఖ్యంగా ఆకివీడు మండలంలోని పెదపేట సెయింట్ పాల్స్ లూథరన్ చర్చికి నోటీసులు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన హర్షకుమార్.. తరతరాలుగా కొనసాగుతున్న చర్చిలకు ఇప్పుడు రికార్డులు అడగడం ఏంటని ప్రశ్నించారు. లూథరన్ సంఘం చర్చిలలో రెండేళ్లకు ఒకసారి పాస్టర్లు బదిలీ అవుతుంటారని, వారి వద్ద పాత రికార్డులు ఉండే అవకాశం తక్కువని పేర్కొన్నారు. అధికారులు అనుసరిస్తున్న ఈ ధోరణి క్రైస్తవ మైనారిటీలను ఇబ్బంది పెట్టేలా ఉందని విమర్శించారు. అయితే, 71 చర్చిలకు ఇచ్చిన నోటీసులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని ఆయన స్వాగతించారు.
ఉండి గ్రామపంచాయతీ పరిధిలోని పెదపేట ప్రాంతంలోని చర్చిలకు పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. చర్చిలకు సంబంధించిన దస్తావేజులు, కలెక్టర్ మరియు పంచాయతీ కార్యాలయం నుంచి పొందిన అనుమతి పత్రాలను తక్షణమే సమర్పించాలని ఆదేశించారు. అనుమతులు లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ నోటీసుల జారీ తీవ్ర వివాదానికి దారితీయడంతో అధికారులు వాటిని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ విషయంపై భిన్నంగా స్పందించారు. ఆకివీడు మండలంలో అనుమతులు లేకుండా జనావాసాల మధ్య 113 చర్చిలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. కేవలం ఇంటి పన్నులు కడుతూ చర్చిలు నిర్వహిస్తున్నారని, అనుమతులు లేని వాటికి త్వరలోనే నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు.
శ్రీరామనవమి సందర్భంగా పెదపేటలోని రామాలయాన్ని సందర్శించేందుకు రఘురామకృష్ణరాజు వెళ్లినప్పుడు అక్కడ గొడవ జరిగిన విషయం తెలిసిందే. రెవెన్యూ రికార్డుల ప్రకారం అక్కడ రామాలయం ఉందని, భక్తుల కోరిక మేరకు దానిని నిర్మిస్తామని ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలోనే చర్చిలకు నోటీసుల పర్వం మొదలవ్వడం స్థానికంగా ఉత్కంఠ రేపుతోంది.
ప్రభుత్వ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, మతపరమైన అంశాల్లో సున్నితంగా ఉండాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.

