‘ఈ భార్య కాకపోతే ఇంకో భార్య.. ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం.. ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ..’ అంటూ పదే పదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులపై.. అందునా టీడీపీ అధినేత చంద్రబాబు మీదా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదా చేస్తున్న వ్యాఖ్యలు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు గట్టిగా తగిలేస్తున్నాయా.?
జనసేన నేత పంచకర్ల సందీప్, ఈ విషయమై తాజాగా ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘పవన్ కళ్యాణ్ విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలు వైఎస్ షర్మిలకీ వర్తిస్తాయా.? అసలు వైఎస్ జగన్ తిట్టాలనుకుంటున్నది పవన్ కళ్యాణ్ని కాదు.. పరోక్షంగా వైఎస్ షర్మిలని.. అని అనుకోవచ్చా..’ అంటూ పంచకర్ల సందీప్ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు.
‘రాజకీయంగా విమర్శలు చేసుకుందాం.. కుటుంబాల జోలికి.. అందునా, భార్యల జోలికి వెళ్ళొద్దు.. మీరు ముఖ్యమంత్రి.. మీకు ఒకరే భార్య.. మరి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు.? పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటి.?’ అని సందీప్ ప్రశ్నిస్తున్నారు.
సందీప్ వ్యాఖ్యల వ్యవహారంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీలో ఒకింత ఆందోళన వ్యక్తమైందట. ఈ విషయం అధినేత్రి షర్మిల దృష్టికి తీసుకెళ్ళారట. ‘షర్మిల పట్ల మేం అభ్యంతరకర వ్యాఖ్యలు చేయబోం. కారణాలేవైనా.. ఆమె కూడా ఇంకో పెళ్ళి చేసుకున్నారు. అది తప్పు కాదు. పవన్ కళ్యాణ్ కూడా అంతే. తెలంగాణలో షర్మిల ప్రత్యర్థులకు వైఎస్ జగన్ ఆయుధాన్నిస్తున్నారు.’ అన్నది సందీప్ ఆరోపణ.
అది కూడా నిజమే.! ఈ విషయమై షర్మిల కూడా ఆందోళన చెందుతున్నారట. పవన్ మీద వైఎస్ జగన్ విమర్శలు, తనను రాజకీయంగా ఇరకాటంలో పెడతాయన్నది షర్మిల ఆందోళనగా కనిపిస్తోందని అంటున్నారు.
