వైఎస్ జగన్ పుట్టినరోజు.! యెల్లో మీడియా ఏడుపు.!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అధికార పార్టీ సొంత మీడియాకి ప్రకటనలూ పోటెత్తాయ్. వీటిల్లో ప్రజాధనం వెచ్చించి ఇచ్చిన ప్రకటనలూ వున్నాయంటూ యెల్లో మీడియా గగ్గోలు పెడుతోంది.

అధికారంలో ఎవరున్నా, సొంత మీడియాకి ప్రకటనలు ఇప్పించుకోవడం అనేది ఎప్పటినుంచో వస్తున్నదే. అధికారం కోరుకునేది, ప్రజల సొమ్ముతో జల్సా చేయడానికే.. అన్నట్లు తొలుత రుచి చూపించింది కూడా తెలుగుదేశం పార్టీనే. దాన్ని వైసీపీ మార్చాల్సింది పోయి.. కొనసాగిస్తోందనుకోండి.. అది వేరే సంగతి.

వైసీపీ సొంత మీడియాకి ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు.. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని పబ్లిసిటీ కోసం దుర్వినియోగం చేస్తున్నారు.. అంటూ యెల్లో మీడియా తెగ బాధపడిపోయింది. మరి, టీడీపీ హయాంలో జరిగిందేంటి.?

చంద్రబాబు అధికారంలో వుంటే, ఆర్థికంగా బలపడొచ్చు కాబట్టే కదా, టీడీపీ అనుకూల మీడియా.. చంద్రబాబు భజన చేసేది. నిజానికి, ఈ విషయంలో మార్పు రావాల్సింది ప్రజల్లో. ఎందుకంటే, ఖర్చవుతున్నది, వృధా అవుతున్నది జనం సొమ్ము గనుక.

ఆ ప్రజలకు ఇలాంటి విషయాల్లో పెద్దగా ఆసక్తి వుండడంలేదు. రోజులు మారాయ్.! మీడియా సంస్థలపై మీడియా సంస్థలే గగ్గోలు పెట్టే రోజులొచ్చాయ్. వైసీపీ అనుకూల మీడియాతోపాటు టీడీపీ అనుకూల మీడియాకి కూడా ప్రకటనలు రావాలంటే.. ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలే కాదు.. ప్రభుత్వం చేసే మంచి పనుల్ని కూడా గుర్తించాలి మరి.!