కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు.. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ. ‘దుష్ప్రచారం చేస్తోన్నవారిపై ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ తిట్టాలి.. గట్టిగా తిట్టాలి.. లేకపోతే, తప్పుడు సంకేతావు వెళతాయ్..’ అంటూ కలెక్టర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన సూచనలు వివాదాస్పదమవుతున్నాయి.
ఎవరు అధికారంలో వుంటే, వారికి అనుగుణంగా అధికారులు పనిచేయక తప్పని పరిస్థితి వుంది ఇప్పుడున్న రాజకీయాల్లో. ఎవరు అధికారంలో వున్నా ఇదే పరిస్థితి. అధికారులు ‘చెంచాగిరీ’ చేస్తున్నారన్న ఆరోపణలు ఈనాటివి కావు.
గతంలో టీడీపీ హయాంలో అప్పటి అధికారులపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పుడు వైసీపీ హయాంలో అదే అధికారుల మీద టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అంతిమంగా అధికారులే బలిపశువులు అవుతున్నారు రాజకీయంగా.!
సరే, అందుకు ప్రతిఫలం కొందరు అధికారులకు రాజకీయంగా దక్కుతోందనుకోండి.. అది వేరే సంగతి. కానీ, కలెక్టర్లు ఎవర్నో తిట్టాలనడం ముఖ్యమంత్రికి సబబు కాదు. ఇదే విషయమై ఉద్యోగ వర్గాల్లో లోతైన చర్చ జరుగుతోంది.
తప్పుడు ప్రచారంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించడం వరకూ తప్పు పట్టలేం. కానీ, కలెక్టర్లు మీడియా ముందుకొచ్చి ఎవర్నో ఎందుకు తిడతారు.? 2024 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారితే, అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో వుంటే.. వైసీపీని అప్పడు కలెక్టర్లు తిడితే ఊరుకుంటారా.? ఇలా అధికార వర్గాల్లో చర్చ జరుగుతుండడం వైసీపీ ప్రభుత్వానికీ, వైసీపీ పార్టీకీ అస్సలు మంచిది కాదు.
