పేద, మధ్యతరగతి ప్రజల మనస్సు జగన్ కి తెలిసినంతగా మరే నాయకుడికీ తెలియదన్నా అతిశయోక్తి కాదనే స్థాయి సంఘటన ఒకటి తాజాగా ఏపీలో జరిగింది. సర్కార్ బడుల్లో ఇంగ్లిష్ అనే విషయంపై ఇప్పటికే పేద, మధ్యతరగతి ప్రజల అభిమానన్ని పొదిన జగన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున జగన్… తాజాగా విద్యను మరింత ప్రోత్సహించేపనికి పూనుకున్నారు.
అందులో భాగంగా… ఏపీ సర్కార్ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా టెన్త్ క్లాసులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నియోజకర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సత్కరించి.. నగదు ప్రొత్సాహకం ఇవ్వనుంది. ప్రైవేటు పాఠశాల్లో టాప్ ర్యాంక్స్ లో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఫోటోలో ఫ్లెక్సీల్లో వేసి ఆయా స్కూల్లు పబ్లిసిటీ చేసుకుంటాయి. కానీ.. ప్రభుత్వ స్కూళ్లలో ర్యాంక్స్ సాధించిన వారిని ప్రోత్సహించేదెవరు? నేనున్నా అంటున్నారు సీఎం జగన్!
గవర్నమెంటు స్కూళ్లలో టెన్త్లో టాప్ విద్యార్థులకు ప్రోత్సాహకాలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. నియోజకవర్గంలో 1,2,3 స్థానాల్లోని విద్యార్థులకు వరుసగా రూ. 15వేలు, రూ.10వేలు, రూ.5వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మే 23న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించాలని సూచించింది. వారికి నగదు ప్రోత్సాహంతోపాటు… పతకం, మెరిట్ సర్టిఫికేట్, జ్ఞాపికను అందజేస్తారు.
ఇదేవిధంగా… మే 27న జిల్లా స్థాయిలో టాపర్స్ ను సన్మానించాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. ఇందులో భాగంగా… జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకర్ కు రూ. 50,000 నగదు పురస్కారం, రెండవ, మూడవ ర్యాంకర్ లకు వరుసగా రూ.30,000, రూ.10,000 రూపాయల ప్రొత్సాహక నగదు ఇవ్వనున్నారు. అసెంబ్లీ, జిల్లా స్థాయి కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు.
ఇదేక్రమంలో… మే 31న జరిగే రాష్ట్ర స్థాయి టాపర్ లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్కరించనున్నారు. ఈ సందర్భంగా… ప్రభుత్వ పాఠశాలల స్థాయిని నిరూపించిన మొదటి ర్యాంకర్ కు 1 లక్ష నగదు పురస్కారం, రెండవ, మూడవ ర్యాంకర్ లకు వరుసగా రూ.75,000, రూ.50,000 లు అందజేయనున్నారు. దీంతో.. ఇది ప్రభుత్వ విద్యా రంగంలో ఒక కీలక ఘట్టమని… దీనిఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు జరుగుతాయని.. తల్లితండ్రుల ఆలోచనావిధానం కూడా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
