పవన్, లోకేష్.. ఇద్దిరికీ ఒకేసారి చెక్ పెట్టిన వైఎస్ జగన్.!

రోడ్లపై బహిరంగ సభలు వద్దు.. ర్యాలీలూ వద్దు.! ఇదీ వైఎస్ జగన్ సర్కారు షాక్ ఇచ్చిన తీరు. ఈ షాక్ ఎవరికో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగుదేశం పార్టీనీ, జనసేన పార్టీనీ.. జనంలోకి వెళ్ళకుండా చేయడం కోసం తగిన సమయం కోసం వేచి చూసి, సరైన ‘వ్యూహం’ పన్నారు వైఎస్ జగన్.

రోడ్లపై ట్రాఫిక్ నరకం చూస్తోన్న జనం, రాజకీయ పార్టీల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులతో విసిగిపోయారు. దాంతో, జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. కానీ, రాజకీయ వ్యతిరేకత అయితే వస్తుంది.

నారా లోకేష్ యువగళం పాదయాత్రకి వైఎస్ జగన్ ఇలా చెక్ పెట్టారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. పాదయాత్ర జరగాల్సింది రోడ్ల మీదనే. దాన్ని ర్యాలీ అనండీ, ఇంకేదన్నా అనండి.. జనం అయితే, నారా లోకేష్ వెంట నడవాలి. కానీ, దానికిప్పుడు అనుమతి వుండకపోవచ్చు.

మరోపక్క, జనసేన అధినేత లక్షలు పోసి మరీ ‘వారాహి’ వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. దాని పరిస్థితేంటి.? ‘ఎవరు అడ్డుకుంటారో చూస్తాను..’ అంటూ అధికార పార్టీ నేతల్ని గాడిదలంటూ నీఛంగా పేర్కొని.. తన స్థాయిని తగ్గించుకున్నారు.

పవన్ ఎలా ఆ వాహనం మీద ఆంధ్రప్రదేశ్‌లో తిరుగుతారు.? లోకేష్ సంగతేంటి.? ఈ ఇద్దరి వ్యవహారం పక్కన పెడదాం, అసలంటూ వైఎస్ జగన్ ఎలా రోడ్ల మీదకు వెళతారు.? అన్నదే కీలకం ఇక్కడ.