రాష్ట్రంలో కావొచ్చు, దేశంలో కావొచ్చు.. సంక్షేమ పథకాలు పొందుతున్నవారిలో సగానికి పైగా అనర్హులే వుంటారు. ఇది ఓపెన్ సీక్రెట్. అందరికీ అన్నీ తెలుసు. కానీ, అనర్హులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఎవరు అధికారంలో వున్నాసరే, అత్యుత్సాహం ప్రదర్శించక తప్పదు.
తాజాగా, సామాజిక అలాగే వృద్ధాప్య పెన్షన్ల ఏరివేత వ్యవహారం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అనర్హులకు సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం పెరిగిపోతోందనేది ప్రభుత్వ భావన. కానీ, వైసీపీ వ్యతిరేక మీడియా, ఈ వ్యవహారంపై అసత్యాల్ని ప్రచారం చేస్తోంది. ఇధే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా కుండబద్దలుగొట్టారు.
అర్హులెక్కడున్నారో వెతికి మరీ వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. అలాంటప్పుడు, అనర్హులకు సంక్షేమ పథకాలు అందుతోంటే చూస్తూ ఎలా ఊరుకోగలం.? అన్న ప్రశ్న సంధించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష సందర్భంగా.
నిజమే కదా.! అనర్హులైనవారిని సంక్షేమ పథకాల లబ్దిదారుల లిస్టులోంచి తొలగించెయ్యాలి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, అదే జరిగితే.. ఆయా సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారుల జాబితా సగానికి పడిపోతుంది. కాదు కాదు, అంతకన్నా దిగువకు పడిపోతుంది. ఓటు బ్యాంకు రాజకీయాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అర్హులు, అనర్హులన్న మాటకే తావు లేదు. ప్రతిదాంతోనూ రాజకీయ ప్రయోజనమే ముడిపడి వుంటుంది.
సంక్షేమ పథకాల లబ్దిదారులంటే దోపిడీదారులేనన్నట్టు మారింది పరిస్థితి. సంక్షేమం పెరిగిపోతే అభివృద్ధి కుంటుపడిపోతుంది మరి.! కష్టపడి పన్నులు కట్టేవారికి సంక్షేమ పథకాలు అందవ్. కానీ, ఆ పన్నుల సొమ్ము, సంక్షేమ పథకాల లబ్దిదారులకు అప్పనంగా వెళుతుందన్నది ఓ వాదన. ఇందులోనూ నిజం లేకపోలేదు.
