రాయలసీమ గుండాలు కాదు… గోదావరి జిల్లాల కాపులూ కాదు!

డైరెక్టుగా పాయింట్ లోకి వచ్చేస్తే… 2016లో తునిలో జరిగిన రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టేసింది. ఘటనపై సరైన సాక్ష్యాలు లేని కారణంగా 43 మందిపై పెట్టిన కేసులన్నింటినీ కోర్టు కొట్టేసింది. ఇదే క్రమంలో… కేసు దర్యాప్తులో సరిగా వ్యవహరించని ముగ్గురు రైల్వే అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం… ఆ ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని రైల్వే ఉన్నతాధికారులకు సూచించింది. ఈ కేసులో ముద్రగడ పద్మనాభం ఏ1, దాటిశెట్టి రాజా ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే.

ఒకసారి వెనక్కి వెళ్తే… కాపులకు రిజర్వేషన్ డిమాండ్‌ తో ముద్రగడ పద్మనాభం 2016 జనవరి 30న తునిలో బహిరంగసభ నిర్వహించారు. బహిరంగ సభ జరిగిన స్థ‌లానికి పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. సభ జరుగుతున్న సమయంలోనే అటు నుండి వెళ్తోన్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ పై గుర్తుతెలియ‌ని కొందరు దుండగులు హఠాత్తుగా దాడిచేసి నిప్పుపెట్టారు. దాంతో రైలంతా దగ్ధమైపోయింది. అదృష్టవశాత్తు ప్రయాణికుల్లో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.

ఈ సభ సజావుగా జరగకుండా.. కొన్ని “దుష్ట శక్తులు” ఈ పనికి పూనుకున్నాయని అప్పట్లో కొందరు కాపు సామాజికవర్గ నాయకులు… టీడీపీ పై విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయాలు తమకు తెలుసంటూ.. ఆరోపణలు చేశారు. అయితే… అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు తనదైన శైలిలో నోరు జారారు. అవును… ఘటన జరిగిన వెంటనే మీడియాతో మాట్లాడిన చంద్రబాబు… రైలు దగ్ధం చేసింది రాయలసీమ గూండాలే అని ప్రకటించారు. పరోక్షంగా వైసీపీ నేతలని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు.

పోనీ ఆ ఆరోపణలకు అయినా కట్టుబడ్డారా అంటే… అదీ లేదు. ఆరోపణలు చేసిందేమో రాయలసీమ గుండాలని.. కేసులు పెట్టి అరెస్టులు చేసిందేమో ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు నేతలను! రాయలసీమకు చెందిన ఏ ఒక‌రిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఎందుకంటే రైలు దగ్దానికి వైసీపీ నేతలకు ఎలాంటి సంబంధంలేదని! ఇదే క్రమంలో… ఘటనతో తమకు కూడా ఎలాంటి సంబంధం లేదని కాపు నేతలు ఎంత మొత్తుకున్నా చంద్రబాబు వినిపించుకోలేదు. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో యాక్టివ్‌ గా ఉన్నవాళ్ళల్లో చాలామందిపై కేసులు పెట్టేశారు. ఫలితంగా… కాపు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు తనదైన వ్యూహాన్ని అమలుపరిచారు.. సక్సెస్ అయ్యారు!

అయితే కాపు నేతల రిక్వెస్ట్‌ కారణంగా రెండు నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. కాపులపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంది. ఇప్పుడు కోర్టు కూడా ఈ కేసులను కొట్టేసింది. కోర్టు నిర్ణయంతో ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజాతో పాటు తదితరులకు పెద్ద రిలీఫ్ దొరికొనట్లే అనుకోవాలి. మరి ఈ కేసులో విముక్తి దొరికిన కాపు సామాజికవర్గ నేతలు వైసీపీపై కృతజ్ఞతలు చెబుతున్నారని తెలుస్తుంది.

తమపై చంద్రబాబు అక్రమంగా కేసులు పెట్టినప్పుడు పవన్ స్పందించలేదు.. కాపు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు బాబు వ్యూహాత్మకంగా అడుగులు వేసినప్పుడు పవన్ మాట్లాడలేదు.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాను కాపుల ప్రతినిధిని, తాను చెప్పినట్లే కాపులంతా వింటారన్నట్లుగా పవన్ మాట్లాడుతున్నరంటూ… ఈ సందర్భంగా గతంలో అరెస్టైన కాపు నాయకులు చెబుతుండటం గమనార్హం!

ఇదే సమయంలో… గతంలో రైల్ తగులబెట్టింది రాయలసీమ గూండాలని విమర్శించిన చంద్రబాబు… కాపు నాయకులపై అక్రమంగా కేసులు పెట్టిన విషయాన్ని ఖండించని పవన్ లు… రాయలసీమ ప్రజానికానికి – గోదావరి జిల్లాల కాపులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి!