తెరపైకి టైమ్స్ నౌ నవభారత్ సర్వే… పవన్ – బాబులకు ముచ్చెమటలు!

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో ఓటర్లు ఎవరికి అనుకూలం అనేదానిపై నాయకులు మల్లగుల్లాలు పడుతున్న సంగతి తెలిసిందే. లోలోపల ఆందోళన ఎలా ఉన్నప్పటికీ… పైకి మాత్రం ఎక్కడలేని ధైర్యం ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ పని అయిపోయిందంటూనే… పవన్ తో పొత్తుకు బాబు రెడీ అవుతున్నారు.

ఇదే సమయంలో ఈసారి జనసేన ప్రభుత్వమే, ప్రజల్లో జగన్ పై వ్య్తిరేకత ఉందని అని అంటున్న పవన్… గోదావరి జిల్లాలే కేంద్రంగా టీడీపీ చాటున రాజకీయాలు చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో నవరత్నాలు అమలు చేశాం, ప్రతి ఒక్కరినీ సంతోష పెట్టాం, ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకంలో లబ్ధి చేకూర్చాం.. ఓట్లన్నీ మావేనంటోంది వైసీపీ.

ఈ సమయంలో తాజాగా టైమ్స్ నౌ నవభారత్ మీడియా సంస్థ చేపట్టిన సర్వే తెరపైకి వచ్చింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం ఏపీలో ఓటర్లు వైసీపీకే పట్టం కడతారని తేలింది.

అవును… టైమ్స్ నౌ నవభారత్ దేశవ్యాప్తంగా లోక్ సభ సీట్ల విషయంలో సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా ఏపీకి సంబంధించి 25 లోక్ సభ స్థానాల్లోనూ సర్వే చేపట్టిన ఆ సంస్థ… వాటిలో 24 లేదా మొత్తం సీట్లు వైసీపీకే దక్కుతాయని తెలిపింది. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ఆ సంస్థ పేర్కొంది.

దీంతో… 24 లేదా 25 లోక్ సభ సీట్లు వైసీపీకే దక్కితే.. అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా ఆ పార్టీకి తిరుగుండదనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. దీంతో… వైనాట్ 175 కి జస్టిఫికేషన్ జరిగినా ఆశ్చర్యం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.