Chandrababu: అండమాన్‌లో టీడీపీ విజయకేతనం.. చంద్రబాబు ఏమన్నారంటే..

అండమాన్ నికోబార్ దీవుల్లో తెలుగు దేశం పార్టీ ఓ విశేష విజయాన్ని నమోదు చేసింది. శ్రీ విజయపురం మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ పదవిని టీడీపీ అభ్యర్థి ఎస్. షాహుల్ హమీద్ గెలుచుకోవడం పార్టీ వర్గాల్లో సంతోషాన్ని నింపింది. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసం గెలవడమే తమ పార్టీ లక్ష్యమని, ఈ విజయం పార్టీ నైతిక బలాన్ని మరింత పెంచిందన్నారు.

షాహుల్ హమీద్ గెలుపుకు కృషి చేసిన స్థానిక టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. “ప్రజల మద్దతు అనేది మాకు దిశా నిర్దేశం. విజయపురం ప్రజలు చూపిన విశ్వాసం మరువలేనిది” అని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే టీడీపీ ప్రధాన అజెండా అని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించాలన్నదే తమ సంకల్పమని స్పష్టం చేశారు.

ఈ విజయంలో ముఖ్యపాత్ర పోషించిన నేతలందరినీ చంద్రబాబు అభినందించారు. టీడీపీ అండమాన్ నికోబార్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. మణిక్యరావు యాదవ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఇన్‌చార్జ్ వి. మాధవ నాయుడు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేసిన సందర్భంగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజోయ్ బైరాగికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అండమాన్ దీవుల్లో తెలుగు ప్రజలతో పాటు, ఇతర మద్దతుదారుల సైతం టీడీపీపై చూపిన అభిమానం, నమ్మకానికి నిదర్శనంగా ఈ విజయం నిలిచిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పటిష్టమైన వ్యూహంతో ప్రజలకు చేరువగా పనిచేస్తే, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా టీడీపీ విజయపథంలో సాగగలదని ఈ ఫలితం మరింత స్పష్టంగా చాటింది.

మోడీ వ్యూహం | Journalist Bharadwaj About Modi Big Shock to Pakistan || India Vs Pak  | Pahalgam | TR